Indian Student | అగ్రరాజ్యం అమెరికా (America)లో ఇటీవలే వరుసగా భారతీయ విద్యార్థుల (Indian Students) మరణాలు కలవరానికి గురి చేస్తున్నాయి. తాజాగా మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. భారత సంతతికి చెందిన సమీర్ కామత్ (Sameer Kamath) అనే 23 ఏళ్ల విద్యార్థి మృతదేహాన్ని వారెన్ కౌంటీ పోలీసులు సోమవారం సాయంత్రం గుర్తించారు.
సమీర్ ఇండియానా (Indiana) రాష్ట్రంలోని పర్డ్యూ యూనివర్సిటీ (Purdue University)లో మెకానికల్ ఇంజినీరింగ్లో మాస్టర్స్ పూర్తి చేశాడు. అతడికి అమెరికా పౌరసత్వం కూడా ఉంది. ప్రస్తుతం సమీర్ పీహెచ్డీ చేస్తున్నాడు. 2025లో తన పీహెచ్డీ పూర్తవ్వాల్సి ఉంది. ఇంతలోనే యూనివర్సిటీ సమీపంలో అతడు శవమై కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సమీర్ మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. సమీర్ మృతదేహానికి మంగళవారం సాయంత్రం పోస్ట్ మార్టం కూడా పూర్తైంది.
ఈ ఏడాదిలో అమెరికాలో భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం ఇది వరుసగా ఐదో ఘటన కావడం గమనార్హం. కాగా, పర్డ్యూ వర్సిటీలో అనుమానాస్పద స్థితిలో భారతీయ విద్యార్థి మరణించడం ఇది రెండో ఘటన. ఇటీవలే నీల్ ఆచార్య అనే విద్యార్థి మృతదేహం యూనివర్సిటీ ప్రాంగణంలో పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. నీల్ కనిపించడం లేదని అతని తల్లి ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే అతని మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. అంతకు ముందు వారం ఓహియో ప్రాంతంలో భారత సంతతికి చెందిన 19 ఏళ్ల శ్రేయస్ రెడ్డి ఇదే విధంగా మృతి చెందాడు. జార్జియాలోని లిథోనియాలో హర్యానాకు చెందిన వివేక్ సైనీ అనే భారతీయ విద్యార్థిని ఓ వ్యక్తి సుత్తితో కొట్టి దారుణంగా చంపిన విషయం తెలిసిందే. ఇక గత నెలలో ఇల్లినాయిస్ యూనివర్శిటీ సమీపంలో భారతీయ-అమెరికన్ విద్యార్థి అకుల్ ధవన్ శవమై కనిపించాడు. ఇలా భారతీయ విద్యార్థుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
Also Read..
Visa Free Entry | భారతీయ పర్యాటకులకు వీసా ఫ్రీ ఎంట్రీ ప్రకటించిన ఇరాన్.. షరతులు వర్తిస్తాయి..!
Red Sea | ఎర్రసముద్రంలో భారత్కు వస్తున్న నౌకపై హౌతీ రెబల్స్ దాడి