Taiwan | తైపే, జనవరి 12: చైనాకు ద్వీపదేశంగా ఉన్న తైవాన్పై యుద్ధమేఘాలు ముసురుకుంటున్నాయి. తైవాన్లో శనివారం జరుగనున్న ఎన్నికల్లో వెలువడే ఫలితాల ఆధారంగా ఆ దేశ భవితవ్యం ఆధారపడి ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తైవాన్ను తన చెప్పుచేతుల్లోకి తీసుకోవాలని భావిస్తున్న చైనా ఇప్పటికే ఉచ్చు బిగుస్తున్నది. ద్వీపకల్పాన్ని అష్టదిగ్బంధనం చేసిన చైనా ఆ దేశ కమ్యూనికేషన్ నెట్వర్క్ను కూడా తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నట్టు తెలుస్తున్నది. దీంతో తైవాన్లోని బ్యాంకులు మూతపడుతున్నాయి. ప్రజలు కోట్ల రూపాయల లావాదేవీలను ఆఫ్లైన్లోనే నిర్వహిస్తున్నారు. తైవాన్లోని ప్రపంచంలోనే అత్యంత అధునాతన సెమికండక్టర్ పరిశ్రమ స్తంభించిపోయింది. చైనా ప్రత్యక్షంగా తన సేనలను పంపడం తప్ప మిగిలిన అన్ని విధాలుగా తైవాన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నది. చైనా ప్రత్యక్షంగా దాడికి దిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు రూ.828 లక్షల కోట్ల నష్టం జరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
స్వయంప్రతిపత్తి పాలనలో ఉన్న తైవాన్ను చైనా తనదిగా భావిస్తున్నది. చైనా తమపై దాడిచేసిన రోజున కేవలం తమ రక్షణ వ్యవస్థకు, భద్రతా దళాలకు మాత్రమే నష్టం జరుగదని, తైవాన్ను పూర్తిగా ప్రపంచం నుండి వేరుచేయడానికి ప్రయత్నిస్తుందని ఆ దేశ సైబర్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే తైవాన్ కంప్యూటర్ నెట్వర్క్పై ప్రతిరోజు లక్షల సంఖ్యలో దాడులు జరుగుతున్నాయని తైవాన్ జాతీయ రక్షణ, భద్రత పరిశోధన సంస్థ నిపుణుడు క్రిస్టల్ టు చెప్పారు. ఇప్పటికే కొందరు తమ నెట్వర్క్ను వారి స్వాధీనంలోకి తీసుకొని ‘ఆ రోజు’ కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. చైనా ఆక్రమణను ప్రకటించగానే వారు తమ టెలికమ్యూనికేషన్లను, ఇంధనం, ఆర్థిక రంగాలను స్తంభింపచేయగలరని పేర్కొన్నారు.
సైబర్ దుండగులు తైవాన్ ప్రభుత్వ, రక్షణ సంస్థలనే కాకుండా అక్కడి సెమికండక్టర్ పరిశ్రమను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ప్రపంచ ఆర్థికవ్యవస్థకు జీవనాడిగా పేర్కొనే చిప్స్ సరఫరాలో తైవాన్ కంపెనీలు కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. సెమికండక్టర్ పరిశ్రమలకు సంబంధించిన మౌలిక సదుపాయాలను అవసరమైతే ధ్వంసం చేస్తాం తప్ప వాటిని చైనా దళాల చేతిలో పడనివ్వబోమని అమెరికాకు చెందిన ఓ అధికారి గత ఏడాది అన్నారు.
డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందిన త్సాయి ఇంగ్-వెన్ తైవాన్ అధ్యక్షురాలిగా ఎన్నికైన 2016 నుంచే చైనా ఆ దేశంపై దౌత్యపరమైన, సైనికపరమైన ఒత్తిడిని ప్రారంభించింది. తైవాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడంతోపాటు తమపై ఇతర దేశాల పెత్తనాన్ని నిరాకరించడం చైనాకు కంటగింపుగా మారింది. క్రమంగా తైవాన్కు అడ్డంకులు సృష్టించడం ప్రారంభించింది. దీంతో ఏదో ఓ రోజున చైనా తైవాన్పై దురాక్రమణకు పాల్పడవచ్చన్న ఊహాగానాలు మొదలయ్యాయి. సైబర్ దాడులతో చైనా ఆగిపోదని, ప్రపంచంతో తైవాన్కున్న సంబంధాలను తెగ్గొట్టేందుకు ప్రయత్నించగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తైవాన్పై యుద్ధం జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 10 లక్షల కోట్ల డాలర్ల మేర నష్టం జరుగుతుందని బ్లూమ్బర్గ్ ఎకనామిక్స్ సంస్థ అంచనా వేసింది. ఇది ప్రపంచ జీడీపీలో పదిశాతంగా ఉంటుందని పేర్కొంది. ఇది ఉక్రెయిన్ యుద్ధం కన్నా, కరోనా మహమ్మారి కన్నా, ప్రపంచ ఆర్థిక సంక్షోభం వల్ల జరిగిన నష్టం కన్నా ఎక్కువ అని తెలిపింది. తైవాన్ ప్రజల్లో పెరుగుతున్న జాతీయవాద భావన, వాషింగ్టన్ బీజింగ్ మధ్య విచ్ఛిన్నమవుతున్న సంబంధాలు, పెరుగుతున్న చైనా ఆర్థిక, సైనిక శక్తిని బట్టి తైవాన్లో సంక్షోభం తప్పకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా దురాక్రమణకు పాల్పడితే.. తైవాన్లోని సెమికండక్టర్ల వ్యవస్థ కుప్పకూలుతుందని, దీంతో ప్రపంచవ్యాప్తంగా ల్యాప్టాప్లు, ట్యాబ్లు, స్మార్ట్ఫోన్ల తయారీ స్తంభించిపోతుందని అంటున్నారు.