అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని చిత్తూర్ జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. చిత్తూర్ రూరల్ మండలంలో ఉదయం నుంచి నలుగురిపై దాడి చేశాయి. తీవ్రంగా గాయపడటంతో బాధితులను చికిత్స నిమిత్తం రుయా దవాఖానకు తరలించారు. గాయపడిన వారిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి వజ్రవేలు (55) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
మృతుడిని జీడీ నెల్లూరు మండలం వేల్పూరు ఇందిరానగర్ వాసిగా పోలీసులు గుర్తించారు. జిల్లాలోని శీరంగరాజపురం, గంగాధర నెల్లూరు మండలాల పరిధిలోని అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు బయటకు వచ్చి సమీప గ్రామాల్లో సంచరిస్తున్నాయి. ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరలించేందుకు అధికారులు యత్నిస్తున్నారు. గజరాజుల సంచారంతో అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.