రఫా: ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణకు సంబంధించి చర్చలు విఫమయ్యాయి. దీంతో హమాస్కు ప్రధాన స్థావరంగా ఉన్న గాజాలోని రఫాపై ఇజ్రాయెల్ దాడులు (Israel Air Strikes) ముమ్మరం చేసింది. హమాస్ దాడులకుప్రతిగా ఇజ్రాయెల్ బలగాలు విరుచుకుపడటంతో 16 మంది మరణించారు. రఫాపై వేర్వేరు చోట్ల నుంచి నగరంపై రెండు పర్యాయాలు దాడి జరిగిందని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపాయి. పెద్ద సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయని పేర్కొన్నాయి. ఇక గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 34,683 మంది పాలస్తీనా ప్రజలు మరణించారు.
కాగా, ఇజ్రాయెల్తో ఈజిప్టులోని కైరోలో తాజాగా జరిగిన కీలక చర్చలు ముగిశాయని హమాస్ ప్రకటించింది. చర్చల అనంతరం హమాస్ ప్రతినిధులు ఖతార్ వెళ్లిపోయారని పేర్కొంది. గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణ, యుద్ధం ముగింపు లాంటి హమాస్ కీలక డిమాండ్లను నెతన్యాహు సర్కారు తిరస్కరించినట్టు సమాచారం. దీంతో చర్చలు విజయవంతం కాలేదని అనధికార వార్తల్ని బట్టి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రఫాతో పాటు గాజాలోని ఇతర ప్రాంతాల్లో అతి త్వరలో భారీ దాడులు చేపడతామని ఇజ్రాయెల్ ప్రకటించింది.