Bangladesh : బంగ్లాదేశ్లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఒక ట్రక్కు బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న 15 మంది మరణించారు. మరో పది మందికిపైగా గాయపడ్డట్లు తెలుస్తోంది. ఈ ఘటన బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు వాయువ్య దిశలో తంగైల్ జిల్లా, సొరాటాయిల్ ప్రాంతంలో సోమవారం ఉదయం ఐదు గంటల సమయంలో జరిగింది.
స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కొందరు కూలీలు ఢాకా నుంచి బక్రీద్ వేడుకల కోసం తమ ఊళ్లకు, కుటుంబ సభ్యులు, బంధువుల ఇండ్లకు బయల్దేరారు. ఈ క్రమంలో అక్కడి హైవేపై ట్రక్కును ఆపి అందులో ఎక్కారు. ఇలా పలువురు ప్రయాణికులతో వెళ్తుండగా, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా, అతివేగంగా వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో దాదాపు 15 మంది ప్రయాణికులు మరణించారు. మరో పది మందికిపైగా గాయపడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, రక్షక బృందాలు సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రుల్ని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రులకు తరలించారు.
బంగ్లాదేశ్లో కొంతకాలంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా వేలాది మంది అక్కడ రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. బంగ్లాలో ట్రాఫిక్ రూల్స్ పెద్దగా అమలు కావు. ట్రాఫిక్ వ్యవస్థ కూడా సరిగ్గా పని చేయదు. అలాగే, రోడ్లు బాగోలేకపోవడం, నైపుణ్యం లేని డ్రైవర్ల కారణంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు అక్కడి నివేదికలు తెలుపుతున్నాయి.
,