వాషింగ్టన్: రోగుల ప్రాణాలను కాపాడాల్సిన నర్సు (US nurse) దారుణంగా ప్రవర్తించింది. ఫెంటానిల్ ఐవీలను సాధారణ నీటితో నింపి రోగులకు ఎక్కించింది. నొప్పి నివారణ మందులైన ఆ ఐవీలను చోరీ చేసింది. దీంతో రోగులు అంటువ్యాధుల బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో సుమారు పది మంది రోగులు మరణించారు. అమెరికాలోని ఓరెగాన్లో ఈ సంఘటన జరిగింది. మెడ్ఫోర్డ్లోని అసంటే రోగ్ రీజినల్ మెడికల్ సెంటర్ అధికారులు గత నెల ప్రారంభంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ నర్సుపై పలు ఆరోపణలు చేశారు. టాప్ వాటర్తో ఐవీలను నింపి రోగులకు ఎక్కించిందని తెలిపారు. తద్వారా రోగులకు వినియోగించాల్సిన నొప్పి నివారణ ఫెంటానిల్ ఐవీలను ఆమె దొంగిలించిందని అనుమానించారు. దీని వల్ల రోగులు పలు వ్యాధులకు గురయ్యారని, 2022 నుంచి సుమారు పది మంది రోగులు మరణించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాగా, మరణించిన ఇద్దరు రోగుల కుటుంబాలు ఆ నర్సు ప్రవర్తన గురించి అనుమానం వ్యక్తం చేసినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోగుల సంరక్షణ పట్ల ఆ నర్సు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు స్పష్టమైందని పోలీస్ అధికారి తెలిపారు. అయితే మందుల చోరీ లేదా వాటికి బదులు పరిశుభ్రత లేని టాప్ వాటర్ ఎక్కించడం వల్ల రోగుల మరణాలకు దారి తీసిందా అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.