కేపీహెచ్బీ కాలనీ, సెప్టెంబర్ 7: ఒడిశా నుంచి వలస వచ్చిన యువకులు భవన నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ కిందపడి మృతి చెందారు. ఈ ఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కేపీహెచ్బీ కాలనీ ఇన్స్పెక్టర్, స్థానికుల కథనం ప్రకారం.. హైదర్నగర్ డివిజన్ అడ్డగుట్ట సొసైటీలో ప్లాట్ నం.53ఏ, 82ఏ లోని 800 గజాల స్థలంలో దాసరి సంతోష్, శ్రీరాములు, బిల్డర్ పి.శ్రీనివాస్ నాయుడు స్టిల్ట్ ప్లస్, ఐదు అంతస్తుల భవన నిర్మాణ పనులు మొదలు పెట్టారు. భవనం 6వ అంతస్తులో బాల్కాని గోడ నిర్మాణం కోసం స్కాఫీ ఫ్లోల్డింగ్ (గోవా కర్రలు) ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం ఒడిశాకు చెందిన కార్మికులు సంతు బట్నాయక్ (23), సాన్య బోద్ నాయక్ (18), సాన్య బోద్ నాయక్ (19), బుద్ధ బోద్ నాయక్ (20), బలరామ్ నాయక్ (18) కలిసి గోవా కర్రలపై నిలబడి ఆరవ అంతస్తులో బాల్కాని గోడ పనులు చేస్తుండగా ఒక్కసారిగా ఆ కర్రలు కూలగా.. అదుపు తప్పిన కూలీలు కిందపడిపోయారు.
సంతు బట్నాయక్, సాన్య బోద్నాయక్ రోడ్డుపై పడటంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో యువకుడు సాన్య బోద్ నాయక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మరో ఇద్దరు బుద్ద బోద్నాయక్, బలరామ్ నాయక్ చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కేసు నమోదు చేసినట్లు కేపీహెచ్బీ కాలనీ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ ఘటనను తెలుసుకున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ, కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్రావు, ఇన్చార్జి జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, కూకట్పల్లి సీపీ ఉమాదేవి, టీపీఎస్ శ్రీనివాస్రెడ్డి, బాలానగర్ డీసీపీ శ్రీనివాస్రావు, క్రైమ్ డీసీపీ వేణుగోపాల్రెడ్డి, కూకట్పల్లి ఏసీపీ శివభాస్కర్, ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్సై మౌనిక రెడ్డి అడ్డగుట్టకు చేరుకొని, ప్రమాదంపై ఆరా తీశారు.
భవన నిర్మాణ అనుమతులు రద్దు ..
అడ్డగుట్ట సొసైటీలో ప్లాట్ నం.53ఎ, 82ఎలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనానికి అనుమతులు రద్దు చేస్తున్నట్లు ఇన్చార్జి జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. స్టిల్ట్ ప్లస్ 5 ఫ్లోర్లకు అనుమతులు పొంది, అనుమతులకు విరుద్ధంగా సెల్లార్తో పాటు అదనపు అంతస్తులను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించేది లేదు :ఎమ్మెల్యే గాంధీ
జీహెచ్ఎంసీ అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే ప్రోత్సహించేది లేదని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ అన్నారు. భవన నిర్మాణ పనుల్లో భాగంగా ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందిన వారి బంధువులను ఎమ్మెల్యే , స్థానిక కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం భవన నిర్మాణాలు చేపట్టాలన్నారు. వలస కూలీలు మరణించడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని తెలిపారు.