హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట జీనోమ్ వ్యాలీలో (Genome valley) ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. మంగళవారం ఉదయం కొల్తూరు వద్ద వేగంగా దూసుకొచ్చిన బైకు ఓ ఫార్మా కంపెనీకి చెందిన బస్సును ఢీకొట్టింది. దీంతో బైకర్ అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే బైక్ నుంచి పెట్రోల్ లీకవడంతో మంటలు చెలరేగి బస్సుకు అంటుకున్నాయి. దీంతో బైక్తోపాటు బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదాన్ని గుర్తించిన బస్సు డ్రైవర్ ప్రయాణికులు కిందికి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపుచేశారు. మృతుడిని సిద్దిపేట జిల్లా ములుగు మండలం వరదరాజపురానికి చెందిన సంపత్గా గుర్తించారు. ఆయన ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడని, విధుల నిమిత్తం వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.