దిల్ సుఖ్ నగర్ : విదేశాలకు వెళ్లడానికి నకిలీ డిగ్రీ సర్టిఫికెట్( Fake certificate) కొనుగోలు చేసిన యువకుడిని ఎల్బీనగర్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలోని బృందం అరెస్టు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. కర్మాన్ఘాట్ ఎంఆర్ఆర్ కాలనీకి చెందిన పులిపాటి మణికంఠ (28) ఇంజినీరింగ్ చదువు మధ్యలో ఆపేశాడు. ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లాలనే కోరికతో అమెరికాలో ఉండే స్నేహితుడు జనార్దన్ సూచన మేరకు డిగ్రీ పట్టా కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు.
మేఘాలయ రాష్ట్రానికి చెందిన ఓ వర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసినట్లు నరేశ్ అనే వ్యక్తి నుంచి రూ.1.60 లక్షలకు నకిలీ బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా కొనుగోలు చేశాడు. విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు మణికంఠను అదుపులోకి తీసుకున్నారు. నరేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.