Hyderabad | హైదరాబాద్లోని అత్తాపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్ కలకలం రేపింది. మహీంద్రా థార్ కారులో వచ్చిన నలుగురు యువకులు ఓ యువతిని బలవంతంగా ఎక్కించుకునే ప్రయత్నం చేశారు. వారి నుంచి తప్పించుకునేందుకు మొదట యువతి జాయ్ ఆస్పత్రిలోకి పరిగెత్తింది. కానీ లాభం లేకుండాపోయింది. యువకులు ఆమెను పట్టుకుని బెదిరించి కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు.
ఇది గమనించిన స్థానికులు వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కారును వెంబడించే ప్రయత్నం చేశారు. అత్తాపూర్ నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు పోలీసులు కారును చేజ్ చేశారు. కానీ పోలీసుల కళ్లుగప్పి కిడ్నాపర్లు పారిపోయారు.
నిందితులు ఉపయోగించిన కారుకు నంబర్ ప్లేట్ లేకపోవడంతో వారిని పట్టుకోవడం సవాలుగా మారింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. కాగా, చేజింగ్ సమయంలో కారు వెనుకాలే మరో బైక్ కూడా ఫాలో అయినట్లుగా పోలీసులు గుర్తించారు.