Loan App | వెంగళరావునగర్, మార్చి 24 : లోన్ కోసం ఆన్లైన్లో వెతికిన ఓ యువతిని సైబర్ నేరగాళ్లు మార్ఫింగ్ చేసిన వీడియోలతో వేదింపులకు గురిచేయడంతో ఎస్ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. ఎస్సై శ్రవణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అమీర్పేట ధరంకరం రోడ్డులోని ఓ హాస్టల్లో ఉంటున్న యువతి (24) ఆదివారం ఉదయం గూగుల్ ప్లే స్టోర్ నుంచి క్రెడిట్ స్పార్క్ లైన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుంది. రుణానికి 50శాతం వడ్డీ కట్టాలని, తీసుకున్న మొత్తాన్ని 7 రోజుల వ్యవధిలో చెల్లించాలని నిబంధనలు ఉండటంతో యాప్ను అన్ఇన్స్టాల్ చేసింది.
అయినప్పటికీ యువతి ఖాతాలో రూ.4800 క్రెడిట్ అయ్యాయి. దీంతో బాధితురాలు యాప్లోని నంబరుకు ఫోన్ చేసి తన అనుమతి లేకుండా రుణం ఎందుకు పంపారని ప్రశ్నించడంతో రిటన్ చేయాలని యాప్ నిర్వాహకులు యూపీఐ ఐడీ పంపారు. మొత్తం నగదును తిరిగి చెల్లించగా.. రూ.3200 వడ్డీ కూడా చెల్లించాలని ఫోన్ చేసి డిమాండ్ చేశారు. వడ్డీ చెల్లించకుంటే మార్ఫింగ్ వీడియోలను ఆన్లైన్లో పోస్టు చేసి బెదిరించారు. దీంతో బాధితురాలు మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసును ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.