సికింద్రాబాద్ : మాదక ద్రవ్యాలు అతిపెద్ద సమస్యగా పరిణమించిన నేపథ్యంలో రాష్ట్ర సర్కారు ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో నగర పోలీసులు డ్రగ్స్ నియంత్రణకు పలుచోట్ల అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నగర పోలీసుల నేతృత్వంలో నార్త్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని క్లాసిక్ గార్డెన్లో అవగాహన సదస్సును నిర్వహించారు.
హెరాయిన్, కొకైన్, ఓపియం, గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్న యువత మత్తుకు బానిసగా మారుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని పలువురు వ్యాఖ్యానించారు. ముందుగా రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, నగర సీపీ సీవీ ఆనంద్, సినీ దర్శకుడు కొరటాల శివ, సినీ నటుడు శ్రీనివాస రెడ్డి, నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తిలు జ్యోతి ప్రజ్వలన చేసి అవగాహన సదస్సును ప్రారంభించారు.
ఉత్సాహంతో ఉరకలెత్తాల్సిన యువత డ్రగ్స్ బానిసలుగా మారడంతో జవసత్వాలు సన్నగిల్లి యవ్వనంలోనే శారీరకంగా, మానసికంగా నిర్వీర్యమైపోతున్నారని, దుర్వ్యసనాల బారిన పడుతూ యుక్తవయసులోనే శరీర అంతర్భాగాలు తూట్లు పడి జీవచ్ఛవాలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మాదకద్రవ్యాల ఉచ్చులోకి విద్యార్థులు వెళ్లకుండా ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ కళాశాలల్లో తప్పనిసరిగా అవగాహన సదస్సులు నిర్వహించాలని పలువురు అభిప్రాయపడ్డారు. విద్యార్థులపై 75 శాతం పర్యవేక్షణ బాధ్యత వారి తల్లిదండ్రులకే ఉండాలని, ఇతర ప్రాంతాలకు విద్యార్థులను స్నేహితులతో పంపించకూడదని, ఒకవేళ వెళ్లాలనుకుంటే కుటుంబ సమేతంగా పర్యటించాలని సూచనలు చేశారు.
రాష్ట్రంలో డ్రగ్స్ నిర్ములన కోసం సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని, ఇప్పటికే రెండు సార్లు ఉన్నతాధికారులతో సమావేశాలు ఏర్పాటు చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. మాదకద్రవ్యాలను వ్యసనంగా మార్చుకొని విద్యార్థులు, యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పిలుపునిచ్చారు.
మత్తు పదార్ధాలకు దూరంగా ఉంటూ జీవితాన్ని గడపాలని, డ్రగ్స్కు అలవాటు పడకుండా సమాజంలో యువత ముందుకుసాగాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సినీ దర్శకుడు కొరటాల శివ ,సినీ నటుడు శ్రీనివాసరెడ్డి, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైశ్వాల్, ఫిజిషియన్, డైరెక్టర్ విరించి శర్మ తదితరులు అవగాహన కల్పించారు.