అమీర్పేట : బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవ కనుల పండువగా సాగింది. అమ్మవారి దర్శనానికి భక్తులు అశేషంగా తరలి రావడంతో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. బారీ కేడ్స్ ఏర్పాటు చేసి, క్యూలైన్ల నిర్మాణాలను పకడ్బందీగా నిర్మించడంతోపాటు భక్తుల ఎంట్రీ, ఎగ్జిట్ లైన్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో ఇబ్బందులు తప్పాయి. ప్రభుత్వం తరఫున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణోత్సవ ఏర్పాట్లను కలెక్టర్ దాసరి హరిచందన, నగర అదనపు పోలీస్ కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్, పశ్చిమ మండలం డీసీపీ విజయ్ కుమార్ పర్యవేక్షించారు. కల్యాణానికి మేయర్ విజయలక్ష్మి గద్వాల్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, పార్లమెంట్ సభ్యులు ఎం అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్, సీహెచ్ మల్లారెడ్డితో పాటు పాటు పలువురు అధికార అధికార ప్రముఖులు విచ్చేశారు. సాయంత్రం సమయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. అశేషంగా తరలివచ్చిన భక్తులకు బల్కంపేట పరిసరాల్లో దాదాపు 100కు పైగా అన్నదాన శిబిరాలు వెలిశాయి. బుధవారం సాయంత్రం ఎల్లమ్మ అమ్మవారి రథోత్సవంతో కల్యాణోత్సవ వేడుకలు ముగియనున్నాయి.