మేడ్చల్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): రైతు భరోసా పథకంపై నమ్మకం కోల్పోతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో యాసంగిలో 14,300 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా అందించేలా ప్రభుత్వం నిర్ణయించింది. అరకొర రైతులకు ఇచ్చే రైతు భరోసానైనా సకాలంలో అందిస్తారనుకుంటే అదిలేదు అంటూ రైతులు వాపోతున్నారు. యాసంగిలో 14,300 ఎకరాలకు రైతు భరోసా అందించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 6,410 మంది రైతులకు మాత్రమే రైతు భరోసాను అందించగా.. మిగతా రైతులు తమకు ఎప్పుడు రైతు భరోసా పడేదని ఎదురు చూపులు తప్పడంలేదు.
జిల్లాలో 40,960 మంది రైతులకు ఉన్న పట్టాదారు పాస్పుస్తకాలలో 82వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. యాసంగిలో 14,300 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయగా.. మిగతా 64వేల పైచిలుకు ఎకరాలకు రైతు భరోసాను ప్రభుత్వం కట్ చేసినట్లయింది. జిల్లాలో 64,794 ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. యాసంగిలో మాత్రం 14,300 ఎకరాలకు మాత్రమే రైతు భరోసాను అందించడంపై రైతులు విస్మయానికి గురవుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి ఎకరానికి రూ.12వేలు రెండు దశల్లో చెల్లించాలని తీసుకున్న నిర్ణయం సరిగా అమలు కావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 79,844 ఎకరాలకు రైతుబంధు పథకాన్ని అందించింది. 81వేల ఎకరాల వ్యవసాయ భూములకు పంట పెట్టుబడి సాయం కింద 48,072 మంది రైతులు ఉండగా.. రైతుబంధు పథకం కోసం బ్యాంకు ఖాతాలు పొందుపరచిన 35,877 రైతులకు సీజన్ల వారీగా రూ.33కోట్ల 25లక్షలు రైతుబంధును రైతుల ఖాతాల్లో జమ చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకు అన్ని రకాలుగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పేర్కొంటున్నారు. అర్హులైన రైతులందరికి రుణమాఫీ అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినా రుణమాఫీ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 3,600 మంది రైతులకు మాత్రమే జరిగిందన్నారు. రుణమాఫీ వర్తింజేయాల్సిన రైతులు ఆందోళన చేసినా ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు.