యాదాద్రి : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఉదయం స్వామివారికి చక్రతీర్థ స్నానం, మహాపూర్ణాహుతిని వైభవంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపోత్సవాన్ని శాస్ర్తోక్తంగా జరిపారు. యాదాద్రీశుడి ప్రధానాలయ పునర్నిర్మాణంలో భాగంగా బాలాలయంలోని ఉత్సవ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పుణ్యజలాల్లో వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ చక్రతీర్థ స్నాన ఘట్టాన్ని నిర్వహించారు.
పుష్పయాగం.. దేవతోద్వాసన
సకలలోక పాలకుడు, అవతారమూర్తి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుడికి వివిధ రకాల పూలు.. సహస్రనామ పారాయణాలతో శ్రీ పుష్పయాగం, దేవతోద్వాసన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపారు.
వైభవోపేతంగా మహాపూర్ణాహుతి..
యాగశాలలో చతుస్థానార్చన పూజలు జరిపిన అర్చకులు మహాపూర్ణాహుతిని నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఏర్పడిన సకల దోషాలను తొలగించేందుకు పరిపూర్ణుడైన పరమాత్ముడిని ప్రార్థించి.. నిత్య హవిస్సులను అందించిన అగ్నిదేవుడిని ప్రసన్నం చేసుకునే వేడుకే మహాపూర్ణాహుతి అని ఆలయ ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనరసింహచార్యులు తెలిపారు. ఈ వేడుకలో ఈవో ఎన్.గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనారసింహచార్యులు, మోహనాచార్యులు, యాజ్ఞీకులు ప్రణీతాచార్యులు, ఉప ప్రధానార్చులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
నేటితో ఉత్సవాలు ముగింపు
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ముగియనున్నాయి. చివరి రోజు ఉదయం 10 గంటలకు అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 9 గంటలకు శృంగార డోలోత్సవం నిర్వహించనున్నారు.