జీడిమెట్ల, ఫిబ్రవరి 8: కెమికల్స్ ప్రాసెసింగ్ చేస్తుండగా రసాయన చర్య జరిగి సంభవించిన అగ్నిప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. జీడిమెట్ల ఇన్స్పెక్టర్ పవన్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారి శ్రీనివాస్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల పారిశ్రామికవాడలోని శోధన ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలోని ఫార్మా విభాగంలో బుధవారం సాయిబాబానగర్కు చెందిన మేఘనాథ్ (36), జయదేవ్ దలాయి, శశిధర్ పని చేస్తున్నారు.
ఈ క్రమంలో గదిలో ఉన్న ట్యాంక్లో రసాయనంతో పాటు పౌడర్ వేసి ప్రాసెసింగ్ చేస్తున్నారు. పౌడర్ ఎక్కువ మొత్తంలో పడటంతో రసాయన చర్య జరిగి.. సంచిలోంచి తొలుత మిరుగులు వచ్చి.. ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో అక్కడే పని చేస్తున్న మేఘనాత్, జయదేవ్, శశిధర్కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మేఘనాథ్ మృతి చెందాడు. జయదేవ్, శశిధర్ను నగరంలోని యశోధ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జయదేవ్కు 70 శాతం మేర గాయాలు కావడంతో అతడి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నదని వైద్యులు తెలిపారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీనివాస్రెడ్డి, జీడిమెట్ల ఇన్స్పెక్టర్ పవన్ ఫ్యాక్టరీని సందర్శించి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.