హైదరాబాద్ : కరోనా రెండో దశవ్యాప్తి నుంచి రాష్ట్రం బయటపడిందని వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. కరీంనగర్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరోనా కట్టడిలో, వ్యాక్సినేషన్లో రాష్ట్రం మోడల్గా నిలిచిందన్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో బాధాకరమైన, నిస్సహాయకరమైన పరిస్థితులు ఎక్కడా కనిపించలేదన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ పడకల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేశంలోని ఎన్నో రాష్ట్రాల్లో ఆక్సిజన్ సరఫరా లేక రోగులు మృతి చెందారని, దవాఖానల్లో బెడ్స్ లేక ఇబ్బందులు పడ్డారన్నారు. రాష్ట్రంలో వైద్య సౌకర్యాల కొరత లేదని స్పష్టం చేశారు.
తెలంగాణలో ఏ సమయంలోనూ ఎలాంటి ఇబ్బందులు లేవని.. మొదటి వేవ్ సమయంలో 28వేల బెడ్స్ ఉంటే రెండో దశ వరకు 50వేలకు పెంచినట్లు చెప్పారు. మూడో దశ ముప్పు పొంచి ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో అన్ని రకాలుగా సంసిద్ధమైనట్లు వెల్లడించారు. హైదరాబాద్తో పాటు ఇతర జిల్లాల్లో ఉన్న ఆసుపత్రుల్లో పిల్లల ఐసీయూ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మహమ్మారి తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని అన్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. ప్రజల సహకారం లేనిదే మహమ్మారి కట్టడి చేయడం సాధ్యం కాదన్నారు.
గత ఏడాదిగా పాటిస్తూ వస్తున్న మాస్క్లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం కొనసాగించాలన్నారు. వీలైనంత వరకు జనసమూహాలతో కూడిన కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు. అయితే, వైరస్ నుంచి పూర్తిగా ముప్పు తొలగిపోలేదని, వైరస్ ప్రవర్తన ప్రజలపైనే ఆధారపడి ఉంటుందన్నారు. కేసులు తగ్గుముఖం పడుతున్న ప్రజలు మాస్క్లు ధరించడం, వ్యాక్సిన్ తీసుకోవడం కొనసాగించాలన్నారు. రాష్ట్రంలో శరవేగంగా వ్యాక్సినేషన్ జరుగుతోందని, ఇప్పటి వరకు 1.25 కోట్ల డోసులు పంపిణీ చేశామని చెప్పారు. మరో వైపు మరోవైపు రాష్ట్రంలో ఫీవర్ సర్వే కొనసాగుతోందని, దీని ద్వారా ఫాజిటివిటీ రేటు తగ్గించుకోవచ్చని చెప్పారు.
వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. గత మూడు, నాలుగేళ్లలో మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, టైఫాయిడ్ కేసులు తగ్గాయన్నారు. అన్ని జిల్లాల్లోనూ కొత్తగా మలేరియా కేసులు నమోదు కాలేదని వివరించారు. జిల్లాల్లో కొనసాగుతున్న ఫీవర్ సర్వేపై సీఎం, రాష్ట్ర కేబినెట్కు సమర్పించనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం మహమ్మారి కట్టడికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని, ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు.