న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీపై కరోనా మహమ్మారి రెండో దశలో తీవ్ర ప్రభావం చూపింది. లాక్డౌన్, పలు కఠిన ఆంక్షల అనంతరం కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం జనం మళ్లీ నిర్లక్ష్యంగా ఉండడంతో కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నది. నిబంధనలు పాటించడం లేదంటూ దేశ రాజధానిలోని ప్రముఖ జన్పథ్ మార్కెట్ను మూసివేసింది. మార్కెట్లో కరోనా నిబంధనలు పాటించకపోవడం, ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ ఆదేశాలను ఉల్లంఘించడంతో తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు మూసివేస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఆదేశాలను వెంటనే అమలు చేయాలని న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) డైరెక్టర్, కన్నట్ ప్లేస్ స్టేషన్ ఇన్చార్జిని ఆదేశించింది. సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏప్రిల్ 19 నుంచి మే 30 వరకు ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. జూన్ 7 నుంచి దశల వారీగా మార్కెట్లను తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. ఇటీవల కొవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తుండడంతో డీడీఎంఏ లాజ్పత్నగర్, లక్ష్మీనగర్, కమలానగర్, సరోజినినగర్, సదర్బజార్, కరోల్బాగ్ మార్కెట్లను ఇప్పటికే మూసివేసింది.