మాదాపూర్ : మహిళలు స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలంటే వారికి ఆర్థిక స్వేచ్ఛా ఎంతో అవసరమని గిరిజన, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖ మంత్రి సీతక్క (Minister Seetakka) అన్నారు. కొండాపూర్ సీఆర్ ఫౌండేషన్లోని మహిళ సంక్షేమ కేంద్రంలో వృత్తి, నైఫుణ్య రంగంలో శిక్షణ పొందిన మహిళలకు శుక్రవారం సర్టిఫికెట్ కాన్ఫెరింగ్ ఫంక్షన్ను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ మహిళలు స్వతంత్రంగా జీవనోపాధిని పొంది ఆర్థికంగా ఎదగాలని, మహిళా సాధికారతతోనే మహిళలు అన్ని రంగాల్లో రాణించగలరని అన్నారు. మహిళలు తాముగా నిర్ణయం తీసుకున్నప్పుడే ఆర్థిక స్వేచ్ఛా ( Financial freedom) లభిస్తుందని చెప్పారు. సంపద కొంత మంది వద్దే ఉంటుందని, అది అందరికి చేరువ చేయాలన్న లక్ష్యంతో కొనసాగిన పోరాటాల ఫలితమే నేడు సమాజంలో ప్రశ్నించే గొంతుగా మారిందన్నారు. అన్యాయం జరిగిన చోట ప్రశ్నించే గొంతుక ఉండాలన్నారు.
మహిళలకు ఆర్థిక చైతన్యం, బలాన్ని అందించాలన్నారు. అనంతరం నైపుణ్య రంగంలో శిక్షణ పొందిన మహిళలకు మంత్రి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు నారాయణ, జనరల్ సెక్రటరీ పల్లా వెంకట్రెడ్డి, కోటివిటి ఇండియా వైస్ ప్రెసిడెంట్ విజయ్, స్వామి రామానందతీర్థ ఇనిస్టిట్యూట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ పిఎస్ఎస్ఆర్ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.