రవీంద్రభారతి : తెలంగాణ రాష్ట్రంలో మహిళల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అనేక సంక్షేమ పథకాల ను చేపట్టారని, ఇలాంటి పథకాలు దేశంలో మరేక్కడ లేవని, తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శమని రాష్ట్ర విద్యశాఖ మంత్రి పటోళ్ల సబితారెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ , రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు.
రాష్ట్ర మహిళా కమిషన్, జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్రభారతిలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో వారు ప్రసంగించారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ మహిళలు మహారాణులు కావాలని, అన్ని రంగాలలో రాణించాలని, అద్బుతాలు సృష్టించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కోరుకుంటున్నారన్నారు.
ఇప్పటికే అన్ని రంగాలలో మహిళలు ప్రగతిని సాధిస్తున్నారని, సర్పంచ్ స్థాయి నుంచి రాష్ట్రపతి స్థాయి వరకు ఎదిగారని చెప్పారు. మహిళా సామార్ధ్యాన్ని గుర్తించిన సీఎం ప్రత్యేకంగా ఎస్సీ,ఎస్టీ మహిళల కోసం 53 డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేశారని, అంతే కాకుండా 4 పారిశ్రామిక వాడ ప్రాంతాలను ఏర్పాటు చేశారని ఆమె గుర్తుచేశారు.
అనంతరం సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ప్రతి రోజు మహిళలను తలుచుకోనిదే గడవదని చెప్పారు. దేశ జనాభాలో సగభాగం ఉన్న మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నప్పటికి చిన్న చిన్న సంఘటనలు జరుగుతూనే ఉన్నాయని విచారం వ్యక్తం చేశారు. అందరి లో మార్పురావాలని అప్పుడే మహిళలు ఇంకా అభివృద్ధి చెందుతారని, తద్వారా దేశం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు.
మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారని, మహిళలు ఎక్కడ గౌరవించబడుతారో, పూజించబడుతారో ఆ దేశం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. అయినప్పటికి 50 శాతం మహిళలు హింసకు గురవుతున్నారని, వీరిలో 40 శాతం మంది గృహ హింసలకు గురువుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
హింసను రూపుమాపడానికి చిన్నపిల్లల నుంచే అవగాహన కల్పించాలని సూచించారు. మహిళల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని ఆమె వివరించారు.
ఈ సభలో సిడబ్ల్యుడి ప్రత్యేక కార్యదర్శి దివ్వాదేవరాజన్, మహిళా కమిషన్ డైరెక్టర్లు ఈశ్వరీబాయి, జి. పద్మ, కొమ్ము ఉమాదేవి, కె. రేవతి తదితరులు ప్రసంగించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిధులు పలువురు మహిళా ప్రతినిధులను ఘనంగా సత్కరించారు.