ఖైరతాబాద్, మార్చి 20 : భార్యను ఒప్పించి తనను సైతం పెండ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేసి మోసం చేశాడని నగరానికి చెందిన బాధితురాలు సునీత వాపోయింది. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన తాను డబ్బులు సంపాదించి తన కాళ్లపై తాను నిలబడాలని, ఆమెరికాకు వెళ్లి స్థిరపడాలని కలలు కని హైదరాబాద్కు వచ్చానన్నారు.
ఇక్కడే పని చేసుకుంటూ జీవిస్తున్నానన్నారు. ఓ స్నేహితుడి ద్వారా గాంధీనగర్కు చెందిన నితిన్కుమార్ కామిని పరిచయమయ్యాడని, తనను ప్రేమిస్తున్నానని, పెండ్లి చేసుకుంటానని వెంటపడ్డాడన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో దిగిన పాత ఫొటోను చూపించి సీఎం తనకు ఎంతో దగ్గరని చెప్పాడన్నారు. తన బలహీనతలను ఆసరా చేసుకొని సహజీవనం చేద్దామని, తరువాత పెండ్లి చేసుకొని యూఎస్కు తీసుకెళ్తానని నమ్మబలికాడన్నారు.
కాని అప్పటికే అతనికి పెండ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఆ విషయాన్ని నితిన్ కుమార్ దృష్టికి తీసుకురాగా భార్యను ఒప్పించి తనను కూడ పెండ్లి చేసుకుంటానన్నాడని తెలిపారు. పెండ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా దాటవేస్తూ వచ్చాడని దీంతో నిలదీయగా తనతో గొడవకు దిగాడన్నారు. దీంతో మార్చి 3న గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశానన్నారు. కాని ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి విచారణ చేపట్టలేదని, సదరు వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తనను మోసం చేసిన నితిన్ కుమార్ను శిక్షించి తనకు న్యాయం చేయాలని కోరారు.