సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : ఓ మహిళపై దాడి ఘటన కలకలం సృష్టించింది. రోజంతా మలుపులు తిరుగుతూ నాటకీయ పరిణామాల మధ్య దాడి ఘటన అవాస్తమని తేలింది. ఈ మేరకు సీసీ ఫుటేజీలు పరిశీలించగా ఎలాంటి దాడి జరుగలేదని తేలింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…..బీఎస్మక్తాకు చెందిన ఓ వివాహిత (29) సోమవారం తెల్లవారుజామున 2గంటల ప్రాంతంలో డయల్ 100కు ఫోన్ చేసి తనపై విజయసింహ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడంటూ ఫిర్యాదు చేసింది. దాంతో పంజాగుట్ట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలిని సోమాజిగూడలోని ఓ దవాఖానలో చేర్పించారు. తనను వెంబడిస్తూ ఇంట్లోకి వచ్చిన విజయసింహ బీర్ బాటిల్ పగులగొట్టి తన మెడ, చేతిపై దాడి చేశాడంటూ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మహిళపై దాడి జరిగిందంటూ సోషల్ మీడియాలో హల్చల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధిత యువతి నివాసం ఉంటున్న అపార్ట్మెంట్, సమీపంలో ఉన్న సీసీ ఫుటేజీలను సేకరించారు. అయితే ఆ సమయంలో నిందితుడు విజయ్సింహ అక్కడికి వచ్చినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. బాధితురాలి మాటలకు, వాస్తవాలకు పొంతనలేకపోవడంతో మరింత లోతుగా విచారణ ప్రారంభించారు. బాధితురాలి గొంతు, చేతిపై అయిన గాయాలను వైద్యులు పరిశీలించారు. అయితే అవి కత్తితో గాని, బీరు బాటిల్ పగులగొట్టి గాని గాయపర్చినట్లు ఎక్కడా ఆనవాళ్లు లభించలేదు. దీంతో ఆమెకు ప్రాథమిక చికిత్స నిర్వహించిన వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఈలోగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ సింహ విడుదల చేసిన వాట్సాప్ చాటింగ్లతో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు బాధిత యువతి నిందితుడు విజయసింహకు పలుమార్లు మెసేజ్లు పెట్టి తన ఇంటికి రావాలని పలుమార్లు మెసేజ్లు,వీడియో కాల్స్ చేసినట్లు తేలింది. ఈ చాటింగ్ ఆధారంగా ఉద్దేశపూర్వకంగా తనను ఇరికించే ప్రయత్నం చేసినట్లు నిందితుడు పోలీసులకు ఆధారాలు సమర్పించాడు. సంఘటన జరిగిన సమయంలో తాను తన నివాసంలోనే ఉన్నట్లు ఆధారాలను పోలీసులకు పంపించాడు. దీంతో కేసు మిస్టరీ వీగిపోయినట్లు తెలుస్తోంది.