Hyderabad | ఓ మహిళకు మత్తు మందు ఇచ్చి నగలు దోపీడీ చేశారు. ఈ ఘటన హైదరాబాద్ మధురానగర్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ నెల 13వ తేదీన ఓ మహిళ తన భర్తతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చింది.
ఇక మహిళను గమనించిన ఇద్దరు గుర్తు తెలియని మహిళలు.. ఆమెను అనుసరించారు. కాసేటికి ఆమెతో మాటలు కలిపారు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. కూల్ డ్రింక్స్లో మత్తు మందు కలిపి ఇచ్చారు. కూల్ డ్రింక్ తాగిన వెంటనే ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. ఇదే అదునుగా భావించిన వారు.. మహిళ మెడలో ఉన్న నాలుగు తులాల బంగారం గొలుసు, చెవిదుద్దులు అపహరించారు.
స్పృహలోకి వచ్చిన బాధితురాలు.. తన ఒంటిపై ఉన్న ఆభరణాలు మాయం కావడంతో.. భర్త వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆమె తన భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరిలో ఒక మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.