హిమాయత్ నగర్, జూన్ 28: జీహెచ్ఎంసీ, రాంకీ సంస్థ సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ వృద్ధురాలు మృతిచెందింది. బాగ్ లింగంపల్లికి (Bagh Lingampally) చెందిన రేఖ(60) అనే వృద్ధురాలు ఒంటరిగా ఉంటూ జీవనం సాగిస్తున్నది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉండగా 15 ఏండ్ల క్రితమే భర్త మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వచ్చిన రేఖ.. నారాయణగూడ (Narayanaguda) గాంధీకుటీర్ బస్తీ సమీపంలోని జీహెచ్ఎంసీ చెత్తకుండి పాయింట్ వద్ద కవర్లు కప్పుకుని నిద్రించింది. అయితే శనివారం తెల్లవారుజామున చెత్త క్లియర్ చేసేందుకు రాంకీ సంస్థకు చెందిన సిబ్బంది చెత్త టిప్పర్, జేసీబీతో అక్కడికి వచ్చారు.
వృద్ధురాలు రేఖను గమనించకుండా చెత్తను తొలగించే క్రమంలో జేసీబీ ఆమె తలకు బలంగా తాకడంతో అక్కడిక్కడే మృతి చెందింది. ఈ విషయాన్ని రాంకీ సంస్థ సిబ్బంది పోలీసులకు చెప్పకుండా అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 108 సిబ్బందికి సమాచారం అందించారు.అక్కడికి వచ్చిన వైద్య సిబ్బంది రేఖను పరీక్షించగా అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు. సమీపంలో ఉన్న సీసీటీపీ ఫుటేజీల ఆధారంగా రాంకీ సిబ్బంది.. రేఖ మృతికి కారణమని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా అసలు విషయం తెలిసింది. మృతురాలు రేఖ కుమార్తె సోని ఫిర్యాదు మేరకు ఎస్ఐ శ్రీవాణి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.