సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ): రంజాన్ మాసమంటే ముందుగా గుర్తొచ్చేది హలీం. నోరూరించే ఈ వంటకాన్ని అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారు. అయితే పెరిగిన నిత్యావసర ధరల ప్రభావం ఈ సంవత్సరం హలీంపై పడనున్నది. పెరిగిన నిత్యావసరాలతో ఈ సంవత్సరం హలీం ధరలు పెరగనున్నాయి. గతంలో 400 గ్రాముల హలీం ధర రూ.250 ఉండగా.. ఈ సారి మాత్రం రూ.280 నుంచి రూ.310 వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు సంబంధిత వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.
ఉగాది తర్వాతి రోజు నుంచే రంజాన్..
ఈ సంవత్సరం తెలుగువారి పండుగ ఉగాది తర్వాతి రోజు నుంచే రంజాన్ నెల ప్రారంభం కానున్నది. దీంతో హైదరాబాద్లో హలీం బట్టీలను ఏర్పాటు చేసేందుకు వ్యాపారులు సిద్ధమవుతున్నారు. ఒక్క హైదరాబాద్లోనే సుమారు 6,500 చోట్ల అమ్మకాలు జరుగుతాయన్నది ఓ అంచనా. చార్మినార్, మలక్పేట, కుల్సుంపుర, బహదూర్పుర లాంటి అనేక ప్రాంతాల్లో అప్పటికప్పుడు హలీంను తయారు చేసి వినియోగదారులకు అందజేస్తారు. అంతేకాక అనేక మంది ఆన్లైన్లోనూ ఆర్డర్లు చేస్తుంటారు. రంజాన్ మాసంలో ఏకంగా రూ.500 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందంటే అతిశయోక్తి కాదు. హలీం అంటే ఇష్టపడేవాళ్లు మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ ఉన్నారు. హైదరాబాద్లో తయారైన హలీం సింగపూర్, మలేషియా, సౌదీ అరేబియాలతో పాటు అనేక దేశాలకు ఎగుమతి అవుతున్నది.