బడంగ్పేట, జనవరి 28 : బీఆర్ఎస్తోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బాలాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో జిల్లెలగూడ క్యాంపు కార్యాలయంలో సంఘం సభ్యులు శనివారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ పాలనను దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారని అన్నారు. కులం, మతం, పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు ప్రతి గడపకూ చేరే విధంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరే విధంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. ఆర్యవైశ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్కు అండగా ఉండాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్, మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి కోసం మంత్రి సబితా ఇంద్రారెడ్డి అలుపెరుగని పోరాటం చేస్తుండటంతో ఆకర్షితులమై బీఆర్ఎస్లో చేరుతున్నట్లు బాలాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం సభ్యులు తెలిపారు.
వైకుంఠ రథం ప్రారంభం
పహాడీషరీఫ్, జనవరి 28 : జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో నిరుపేదలకు తమ చివరి మజిలీ కార్యక్రమం సజావుగా సాగడానికి వైకుంఠ రథం ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. రూ. 17 లక్షల వ్యయంతో కూడిన వాహనాన్ని కొనుగోలు చేశామన్నారు. వైకుంఠ రథం నేటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. పేదలు ఆఖరి మజిలీ సమయంలో వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ అబ్దుల్లా సాది, కమిషనర్ వసంత, మున్సిపల్ సిబ్బంది, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.