మణికొండ (హైదరాబాద్) : ప్రజా సమస్యల పరిష్కరానికి కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్గౌడ్ (Mla Prakash Goud) అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నాలుగోసారి విజయం సాధించి ప్రమాణస్వీకారం చేసిన సందర్బంగా గండిపేట బీసీ సెల్ మండల అధ్యక్షులు ఎం. నాగరాజు, ఉపాధ్యక్షులు ఆర్.నర్సింహ ఆధ్వర్యంలో ఆదివారం సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ నిధులను తీసుకువచ్చి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అందరి సహాయ సహకారాలు తీసుకుని ముందుకు వెళతామన్నారు.
అనంతరం కురుమ సంఘం నాయకులు ఎమ్మెల్యే టి.ప్రకాష్గౌడ్ సన్మానించారు. బీరప్ప మల్లన్న స్వామి ఆలయ నిర్మాణానికి సాయంతో పాటు స్థలాన్ని కేటాయింపునకు సహకరిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో మణికొండ మున్సిపల్ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ రామకృష్ణారెడ్డి, సంఘం అధ్యక్షులు బుద్దులు శ్రీరాములు, నాయకులు నరేందర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.