అబిడ్స్ : హర్యానా రాష్ట్రంలో కురుమ సంఘం భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం ద్వారా కేటాయించేందుకు కృషి చేస్తానని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ(Governor Bandaru Dattatreya) తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట్ర కురుమ సంఘం కార్యాలయంలో సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేషం ఆధ్వర్యంలో నిర్వహించిన షెపర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ డెలిగేట్స్ 2024 సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ కురుమలు రాజకీయంగా రాణించి, చట్ట సభలలో ప్రాతినిధ్యం వహించాల్సిన అవసరంఉందని పేర్కొన్నారు. హర్యానా(Haryana) లో కురుమ అకాడమిక్ హాస్టల్ భవనం కోసం స్థలం కావాలని ఎమ్మెల్సీ కోరగా ప్రభుత్వం తరపున కేటాయించేందుకు గాను తన వంతు కృషి చేస్తానని తెలిపారు. మాజీ కర్నాటక మంత్రి హెచ్ఎం రేవన్న మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 12 కోట్ల మంది కురుమలు ఉన్నారని, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా కురుమలను పిలుచుకుంటారని తెలిపారు.
ఎమ్మెల్సీ యెగ్గె మల్లేషం(MLC Yegge Mallesham) మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దశల వారీగా కురుమ వసతి హాస్టల్ భవనాలను నిర్మించి అందులో అకాడమిక్ స్టడీ సర్కిల్లను ఏర్పాటు చేసి నిరుపేద కురుమలకు ఐఏఎస్, ఐపీఎస్ పోటీ పరీక్షలకు కోచింగ్ ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జాతీయ సమావేశంలో షెపర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అద్యక్షుడు ఎహెచ్ విశ్వనాథ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బూరుగడ్డ నాగేష్, క్యామ మల్లేషం, రాష్ట్ర కురుమ సంఘం ప్రధాన కార్యదర్శి బండారు నారాయణ తదితరులు పాల్గొన్నారు.