గతేడాది రూ. 2200 కోట్ల నష్టం ఎండీ వీసీ సజ్జనార్
సుల్తాన్బజార్, మే 25: నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తామని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. కార్గో సేవల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ మొత్తంలో మామిడి పండ్లను రవాణా చేసినట్లు వెల్లడించారు. బుధవారం అబిడ్స్లోని స్మైలింగ్ స్టార్స్ ప్లే స్కూల్ను ప్రారంభించిన అనంతరం.. మీడియాతో మాట్లాడుతూ కొవిడ్, డీజిల్ రేట్ల పెరుగుదల ఇతర కారణాలతో గతేడాది ఆర్టీసీకి రూ. 2200 కోట్ల నష్టం వచ్చిందని, లాభాల బాట పట్టించేందుకు యాజమాన్యం విశేషంగా కృషి చేస్తున్నదని చెప్పారు. కార్గో, హాస్పిటల్ సర్వీస్లను మరింత మెరుగుపరుస్తామని వివరించారు.
సమ్మక్క- సారలమ్మలకు బంగారం, భధ్రాచలం సీతారాముల తలంబ్రాలను చేరవేయడంలో కార్గో సేవలను వినియోగించుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రం నలుమూలలా కార్గో విస్తరించడం ద్వారా హోం డెలివరీ సర్వీసులు కూడా త్వరలో ప్రారంభిస్తామన్నారు.