ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంపై సమరభేరి
ప్రధాని మోదీకి పోస్టుకార్డులతో ఉద్యమం
వడ్లు కేంద్రమే కొనాలంటూ పంచాయతీలు, మండల, పురపాలక వర్గాల్లో తీర్మానాలు
మేడ్చల్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా పాలకవర్గాలు చేపట్టిన తీర్మానాలు ఉద్యమంలా కొనసాగుతున్నాయి. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, మున్సిపాలిటీల్లో కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయాలని చేసిన తీర్మానాల ప్రతులను మంగళవారం ప్రధాని అధికార నివాసానికి కొరియర్, పోస్టాఫీస్ ద్వారా పంపించనున్నారు. ఈ మేరకు సోమవారం నాటికి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా పాలక వర్గాలు తీర్మానాలను పూర్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం చేస్తున్న పోరాటానికి ప్రజాప్రతినిధులు పూర్తి మద్దతును ప్రకటిస్తున్నారు.
కేంద్రం మెడలు వంచుతాం..
కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా రైతులకు మద్దతుగా పాలకవర్గాలు చేస్తున్న తీర్మానాల ప్రతులను మంగళవారం పీఎంవోకు పంపిస్తాం. కేంద్రం మెడలు వంచే వరకు ఉద్యమం కొనసాగిస్తాం. అన్నం పెట్టె రైతన్నలకు అన్యాయం జరుగుతుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. బీజేపీ నాయకులు కేంద్రం వడ్లు కొనుగోలు చేసేలా ఒత్తిడి తేవాలి.
– కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
రైతుల ఉసురు తగులుతది
కందుకూరు, మార్చి 28 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని పీఏసీఎస్ అధ్యక్షుడు దేవరశెట్టి చంద్రశేఖర్ చెప్పారు. మండల ప్రాథమిక వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో పీఏసీఎస్ కార్యాలయంలో రైతులకు మద్దతుగా తీర్మానం చేశారు. అదేవిధంగా అగర్మియాగూడ పంచాయతీ కార్యలయంలో సర్పంచ్ భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో, నేదునూరు గ్రామంలో సర్పంచ్ రామక్రిష్ణారెడ్డి, జైత్వారం ఎర్రబైరు సదాలక్ష్మీ సోమవారం రైతులకు మద్దతుగా తీర్మానం చేసి పీఎంవోకు పంపించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్పర్సన్ సురుసాని వరలక్ష్మీ సురేందర్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గంగాపురం లక్ష్మీనర్సింహరెడ్డి, సురుసాని సురేందర్రెడ్డి, వైస్ చైర్మన్ గోపిరెడ్డి విజేందర్రెడ్డి, డైరెక్టర్లు సురుసాని శేఖర్రెడ్డి, పొట్టి ఆనంద్, సామ పాండురంగారెడ్డి, నర్సింహ, నాయకులు దేశం క్రిష్ణారెడ్డి, గుయ్యని సామయ్య, రవికుమార్రెడ్డి, మండల రైతు విభాగం అధ్యక్షుడు సోలిపేట అమరేందర్రెడ్డి, రూప్ చందర్, శ్రీధర్, ఆయా పంచాయతీ వార్డు సభ్యులు రైతులు పాల్గొన్నారు.
కేంద్రమే వడ్లు కొనాలె.. ఎంపీపీ రఘుమారెడ్డి
మహేశ్వరం, మార్చి 28: యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఎంపీపీ రఘుమారెడ్డి అన్నారు. సోమవారం ఎంపీటీసీలతో కలిసి పీఎంవోకు తీర్మాన కాపీని పోస్టు చేశారు. అదేవిధంగా నాగులదోనితండా, మన్సాన్పల్లిలో సర్పంచ్లు మెగావత్ రాజునాయక్, కంది అరుణ రమేశ్ ఆధ్వర్యంలో కేంద్రం వడ్లు కొనాలని పంచాయతీ కార్యాలయంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సునీతాఆంధ్యానాయక్, సహకార బ్యాంక్ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఆదిల్ అలీ, ఎంపీటీసీలు కుమారి రాయప్ప, స్వప్న రవీందర్, ఉపసర్పంచ్లు బురమోని నర్సింహ యాదవ్, ఊర్మిళ దేవేందర్, వార్డు సభ్యులు రాఘవేందర్రెడ్డి, సాత్విక, చంద్రకళ, చెన్నమ్మ, శ్రీశైలమ్మ, శేఖర్, రాఘవేందర్గౌడ్, కమలమ్మ తదితరులు పాల్గొన్నారు.