మన్సూరాబాద్, జూన్ 22 : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ఓ భార్య హత్య చేసిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించగా.. అనుమానంతో పోలీసులు లోతుగా విచారించి భర్తను హత్య చేసిన భార్యను అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ వినోద్కుమార్ కథనం ప్రకారం.. ఎల్బీనగర్, ఎన్టీఆర్నగర్లో బోడ నర్సింగ్ భార్య బోడ స్వరూపతో కలిసి నివాసముంటున్నాడు. స్వరూపకు తన సొంత గ్రామానికి చెందిన మోహన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది.
ఈ విషయం భర్తకు తెలియడంతో పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఆమెలో మార్పు రాలేదు. తరచూ భర్త అడ్డుపడుతుండటంతో ఎలాగైన నర్సింగ్ను అంతమొందించాలని పథకం వేసుకుంది. ఈ నెల 20న నర్సింగ్, స్వరూప మధ్య తీవ్రంగా గొడవ జరిగింది. అనంతరం భర్తపై దాడి చేసింది. కింద పడ్డ భర్త చాతిపై కూర్చుని చున్నీతో గొంతును గట్టిగా బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు శవాన్ని ఇనుప మంచానికి చున్నీతో కట్టి ఆత్మహత్య చేసుకున్నాడని చుట్టు పక్క వారిని నమ్మించింది.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. శవపరీక్షలో నర్సింగ్ది ఆత్మహత్య కాదని తేలింది. గొంతు నులిమి చంపడం వలనే నర్సింగ్ మృతి చెందాడని వైద్యులు నివేదిక ఇచ్చారు. వైద్యుల నివేదిక ఆధారంగా పోలీసులు నిందితురాలైన స్వరూపను సోమవారం మధ్యాహ్నం అల్కాపురి చౌరస్తా వద్ద అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.