హైదరాబాద్ : ఓ వ్యక్తి తన భార్య పట్ల క్రూర మృగంలా ప్రవర్తించాడు. సైకోగా మారిన భర్త.. భార్యను ముక్కలు ముక్కలుగా నరికి.. ఇంట్లో ఉన్న డ్రమ్ములో దాచి పెట్టాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎస్పీఆర్ హిల్స్లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. అనిల్ కుమార్ అనే వ్యక్తి ఆరు నెలల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యను 2020లో హత్య చేశాడు. అయితే రెండో భార్య సరోజను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే అనిల్, సరోజల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. నెల రోజుల క్రితమే సరోజ తన భర్త వద్దకు తిరిగొచ్చింది. నాలుగు రోజుల క్రితం భార్యను డంబెల్తో కొట్టి చంపాడు. ఆ తర్వాత శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి.. ఇంట్లో ఉన్న డ్రమ్ములో దాచి పెట్టాడు. ఆ తర్వాత ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు.
అయితే సరోజకు ఆమె తల్లిదండ్రులు ఫోన్ చేయగా.. లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానం వచ్చి ఆమె పేరెంట్స్ ఇవాళ ఇంటికొచ్చి చూడగా, తాళం వేసి ఉంది. తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. ఆ ఇంటికొచ్చిన పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా, డ్రమ్ములో మృతదేహం లభ్యమైంది. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని చూసి పోలీసులు షాక్ అయ్యారు. అనిల్ కుమార్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.