మియాపూర్, ఏప్రిల్ 4 : నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో పక్కా రహదారుల నిర్మాణంతో ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ఏ వీధిలోనైనా ఇంట్లో నుంచి కాలు బయటపెడితే సీసీ, బీటీ రహదారులపై ప్రయాణం చేసేలా నిర్మాణాలను చేపడుతున్నామన్నారు. వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని వివేకానందనగర్, సుమిత్రనగర్, బాగ్మీర్ కాలనీలలో రూ.81.23 లక్షల నిధులతో చేపడుతున్న సీసీ రోడ్డు, యూజీడీ నిర్మాణ పనులకు కార్పొరేటర్ మాధవరం రోజాదేవితో కలిసి విప్ గాంధీ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల తోడ్పాటుతో నియోజకవర్గ అభివృద్ధికి రూ.8,500 కోట్ల నిధులు వెచ్చిస్తే.. సగం వరకు రహదారులకే కేటాయించటమే రహదారుల అభివృద్ధిపై తనకున్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. మెరుగైన రవాణా వసతి కల్పించేందుకు మురికి వాడలు సహా అన్ని ప్రాంతాలలో విస్తృతంగా పక్కా రహదారుల నిర్మాణం చేపడుతున్నామని విప్ గాంధీ తెలిపారు. రహదారులపై ఎక్కడా మురుగు జాడ లేకుండా పకడ్బందీ డ్రైనేజీ, యూజీడీ వ్యవస్థను నిర్మిస్తున్నామన్నారు. రహదారులు, డ్రైనేజీలపరంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే 85 శాతానికి పైగా పనులను పూర్తిచేసినట్లు, రాబోయే రోజులలో మిగిలిన పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని గాంధీ పేర్కొన్నారు. నిర్మాణ పనులలో జాప్యంలేకుండా నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఈ గోవర్ధన్, ఏఈ ఆశ, డీజీఎం వెంకటేశ్వర్లు, మేనేజర్ ప్రియాంక, మాజీ కార్పొరేటర్ రంగారావు, పార్టీ నేతలు సంజీవరెడ్డి, భాస్కర్రావు, చంద్రకాంత్రావు, రాంచందర్, ఆంజనేయులు, మహేశ్, శ్రావణిరెడ్డి, విద్యాసాగర్, కాలనీవాసులు పాల్గొన్నారు.
కొండాపూర్, ఏప్రిల్ 4 : అభివృద్ధి, సంక్షేమాలే పరమావధిగా తెలంగాణ సర్కారు ముందుకు సాగుతుందని విప్ గాంధీ అన్నారు. మంగళవారం ఆయన చందానగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి పైపులైన్ నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనుల్లో భాగంగా చందానగర్లోని ఇక్రిసాట్ కాలనీ, సురక్ష ఎన్క్లేవ్ కాలనీలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారం కోసం రూ.50 లక్షల అంచనా వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించామన్నారు. దీంతో పాటుగా వేమన వీకర్ సెక్షన్ కాలనీవాసుల తాగునీటి ఇబ్బందులను తొలగించేందుకు రూ.25లక్షలతో నూతన పైపులైన్ పనులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథరెడ్డి, జలమండలి డీజీఎం నాగప్రియ, మేనేజర్ సునీత, నాయకులు కరుణాకర్ గౌడ్, గుడ్ల ధనలక్ష్మి, వెంకటేశ్, రాజశేఖర్రెడ్డి, హరీష్, కార్తిక్గౌడ్, సందీప్రెడ్డి, నరేందర్, యశ్వంత్, కాలనీవాసులు పాల్గొన్నారు.