రంగారెడ్డి, జూలై 21 (నమస్తేతెలంగాణ) : సిద్ధాపూర్ డంపింగ్ యార్డుపై అక్కడి ప్రజలు ఆందోళన చేస్తుండగా కాంగ్రెస్ నాయకులు కలెక్టర్కు వినతి పత్రం అందజేసి డ్రామాలు ఆడుతున్నది.. దీంతో అధికారంలో ఉండి కలెక్టర్కు వినతిపత్రాలా? నవ్వి పోదురుగాక నాకేమి సిగ్గు అన్న చందంగా ఉంది కాంగ్రెస్ నాయకుల తీరు. ‘సిద్ధాపూర్లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయటం వలన ప్రజల ఆరోగ్యానికి హాని కలగటంతో పాటు పర్యావరణానికి కూడా ముప్పు ఏర్పడుతుంది. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి.’ ఇది ప్రతిపక్ష పార్టీలకి చెందిన నాయకులు చేసిన ప్రకటన కాదు. స్వయంగా ప్రభుత్వానికి చెందిన కాంగ్రె స్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పలికిన మాటలు.
అయితే వీరి మాటలకు ప్రజలు ముక్కునవేలేసుకుంటున్నారు. ‘ఇదేమి సిత్రం ప్రభుత్వం వారిదే కదా.. డంపింగ్ యార్డ్ను రద్దు చేయొచ్చు కదా’ అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంలో ముఖ్యమైన హోదాల్లో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించే అవకాశం ఉన్నా.. ఆ దిశగా కృషి చేయకుండా ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని డాంభికాలు పలకడం సర్వత్రా విమర్శలకు కారణమవుతోంది. సిద్ధాపూర్లో డంపింగ్ యార్డ్ వద్దు అంటూ అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వీరి సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లాల్సిన ఆ జిల్లాకు సంబంధించిన ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి మంగళవారం కలెక్టర్కు వినతి పత్రం అందించి చేతులు దులుపుకున్నారు.
సాధారణంగా ప్రభుత్వ ఆదేశాలతోనే కలెక్టర్ చర్యలు తీసుకుంటారు. సిద్ధాపూర్లో డంపింగ్ యార్డ్ అనేది ప్రభుత్వ నిర్ణయం. ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి కలెక్టర్ కృషి చేస్తారు. ఇలాంటి సమయంలో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది? ఇక్కడి ప్రాంత ప్రభుత్వ పెద్దలదే. కానీ వారు వినతిపత్రాలతో చోద్యం చూస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం వినతిపత్రాలు, మీడియా ప్రకటనలు మినహా సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లడం లేదని విమర్శిస్తున్నారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున డంపింగ్ యార్డ్ వ్యతిరేకత వ్యక్తమవడంతో ఏం చేయలేక తమకు అండగా ఉన్నట్టు నటిస్తున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు.