హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ కోరల్లో చిక్కుకుని సామాన్యుడు నరకం చూస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వేల కోట్ల రూపాయల అంచనాలతో గాల్లో మేడలు కడుతోంది. అవుటర్ చుట్టూ 160 కిలోమీటర్ల మెట్రో లూప్, భారత్ ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీ అంటూ 391 కిలోమీటర్ల నెట్వర్క్ ప్లాన్లను కాగితాలపై గొప్పగా చెప్పుకొంటున్నారు. కానీ నగరానికి అత్యంత కీలకమైన, అత్యవసరమైన ప్రాజెక్టులను మాత్రం పక్కనబెట్టేస్తున్నారు.
ఒకవైపు పాత బస్తీ మెట్రో అతీగతీ లేక కొట్టుమిట్టాడుతోంది. మరోవైపు ఎప్పుడో పూర్తి కావాల్సిన ఎయిర్పోర్టు మెట్రో లైన్ను నిర్వీర్యం చేసి, ఐటీ కారిడార్ నుంచి ఎయిర్పోర్టు కనెక్టివిటీ లేకుండా చేసి గందరగోళంలో పడేసింది. ఇక శివారుల నుంచి రవాణా సదుపాయాలు కరువై జనాలు ఇబ్బందులు పడుతుంటే.. ప్రాధాన్యతలను మరిచి ప్రజాధనంతో తలపెట్టే మెగా ప్రాజెక్టుల పేరిట ప్రచార ఆర్భాటాలకే పరిమితం అవుతోందనే విమర్శలు ఉన్నాయి.
– సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలోనే పాతబస్తీ మెట్రో కారిడార్పై స్పష్టమైన ప్రణాళిక సిద్ధమైంది. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు ఈ సాగే ఈ 7.5 కిలోమీటర్ల ఓల్డ్ సిటీ మెట్రో లైన్, చారిత్రక నగర ప్రజల దశాబ్దాల కల. అయితే అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా.. కాంగ్రెస్ సర్కారు ఈ పనులను కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయించలేకపోయింది. శంకుస్థాపనల పేరిట కాలయాపన చేసిన ప్రస్తుత ప్రభుత్వం, కనీసం ఈ 7.5కి.మీ ప్రాజెక్టుకు అవసరమైన కేంద్ర అనుమతులను కూడా తీసుకురావడంలో పూర్తిగా విఫలమైంది. రూ. 38,595 కోట్ల భారీ అంచనాలతో 122 కిలోమీటర్ల డీపీఆర్ను కేంద్రానికి పంపించి చోద్యం చూస్తున్న సర్కారు ఓల్డ్ సిటీ మె ట్రోను భాగం చేసినప్పటికీ, ఇప్పటికీ కేం ద్రం నుంచి పైసా నిధులు వచ్చేది లేదు. సాం కేతిక అనుమతులు గానీ సాధించలేకపోయిం ది.
గత ప్రభుత్వం రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు ప్రతిపాదించిన ఎయిర్పోర్టు మెట్రో కారిడార్ ప్రాజెక్టును టెండర్లు పూర్తి చేసి, పనులు మొదలుపెట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది.
నిజానికి ఇప్పుడు అత్యవసరంగా నిర్మించాల్సింది ఎడారి వంటి శివారు ప్రాంతాలను కలిపే 160 కిలోమీటర్ల ఓఆర్ఆర్ లూప్ కంటే… ప్రస్తుతం నగరంలో సగభాగం పూర్తయి, కనెక్టివిటీ లేక ఆగిపోయిన ఫేజ్-1 పొడిగింపులను పూర్తి చేయడం వలన ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపడుతోందనే అభిప్రాయం ఉంది. ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో వేయడం కంటే, నగర కోర్ ఏరియా నుంచి శివార్లను అనుసంధానించే లైన్లను పూర్తి చేస్తేనే ప్రయాణికులకు తక్షణ ఉపశనమం కలుగుతోంది. ఇందులో ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు, మియాపూర్ నుంచి పటాన్ చెరు, నాగోల్ నుంచి ఎల్బీనగర్తో పాటు, ఓల్డ్ సిటీ మెట్రో మార్గాలను పూర్తి చేస్తే నగరవాసులకు ఎంతగానో లబ్ధి చేకూరుతోంది. శివారు ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్ మీదుగా నేరుగా ఎయిర్పోర్టు వరకు మెట్రో సేవలు సజావుగా సాగుతాయి.
ప్రస్తుతం ఇబ్రహీంపట్నం, పటాన్చెరు, మేడ్చల్, శామీర్పేట, ఘట్కేసర్ వంటి శివారు ప్రాంతాల నుంచి నిత్యం లక్షలాది మంది ఉపాధి కోసం నగరంలోకి వస్తున్నారు.