సిటీబ్యూరో, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : నాణ్యతా ప్రమాణాలను పాటించని హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులపై ఉక్కుపాదం మోపాల్సిన జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు తనిఖీలు చేపట్టకపోవడంపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ ఫుడ్పై కఠినంగా ఉండాల్సిన అధికారులే క్షేత్రస్థాయి తనిఖీలు చేయకపోవడంపై మండిపడ్డారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ హెల్త్ స్నేహ శబరీష్. ఫుడ్ సేఫ్టీ అధికారులు, కార్పొరేటర్లతో మేయర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తీసుకువచ్చిన ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ మొబైల్ వ్యాన్ తనిఖీలు ఎన్ని చేశారు? అని మేయర్ ప్రశ్నించగా…నీళ్లు నమలడం అధికారుల వంతైంది. అసలు కొత్తగా వచ్చిన ఫుడ్ సేఫ్టీ అధికారుల వివరాలు కూడా అధికారులు చెప్పలేక తడబడ్డారు. అడిషనల్ కమిషనర్ (హెల్త్)గా స్నేహ శబరీష్ కనీసం సమీక్ష నిర్వహించలేకపోవడం, రిటైర్డ్ అధికారి వ్యవహారశైలిపై ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోవడంపై మేయర్ సీరియస్ అయినట్లు తెలిసింది. ప్రజారోగ్యంపై చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్లు ఈవీడీఎం విభాగం సహకారంతో తనిఖీలు నిర్వహించాలని సూచించారు. హోటళ్లు, రెస్టారెంట్లలలో కిచెన్ పరిశుభ్రంగా ఉండేలా, అందులో వాడే పదార్థాలు నాణ్యతతో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇదిలా ఉంటే జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబరు, ‘ఎక్స్’ ట్విట్టర్ వేదికగా ప్రజలు ఫిర్యాదులు చేస్తున్న ఎందుకు పట్టించుకోవడం లేదని మేయర్ ప్రశ్నించారు. అధికారులు మాత్రం ఇప్పటి వరకు 74 కేసులు విధించామని చెప్పడం గమనార్హం. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ఫుడ్ సేఫ్టీ సహాయ సంచాలకులు బాలాజీ, నర్సింహారెడ్డి, కార్పొరేటర్లు సీవీ రెడ్డి, శ్రవణ్, రాజశేఖర్ రెడ్డి, బన్నాల గీత ప్రవీణ్, పద్మ వెంకట్రెడ్డి, ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.