సిటీబ్యూరో, సెప్టెంబర్ 9(నమస్తే తెలంగాణ) : పోషకాహారం అంటే ఏమిటీ? ఎందులో ఏ పోషకాలు ఉంటాయి? పోషకాహారంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటీ? అంటూ ఆన్లైన్లో వెతకడం, సోషల్ మీడియా రీల్స్ చూడటం టెక్ యుగంలో అలవాటుగా మారింది. అయితే ఇంటర్నెట్లో దొరుకుతున్న విస్తృతమైన సమాచారంతో… కొన్ని సార్లు ఇబ్బంది పడాల్సి వస్తోంది. అందుకే శాస్త్రీయ విధానంలో పోషకాహారంపై అవగాహన కల్పించేలా జాతీయ పోషకాహార సంస్థ సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేసింది. ఇప్పటికే పోషకాహారంపై అవగాహన కల్పిస్తుండగా… తాజాగా మై ప్లేట్ ఫర్ ద డే పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీని ద్వారా సులభంగా పోషకాహార ఆవశ్యకత, ఆహారంలోని పోషకాల వివరాలు, ఆరోగ్యాన్ని అందించే ఆహార పదార్థాల వివరాలతో కూడిన జాబితా ప్రకారం రూపొందించి ప్రచారం కల్పిస్తోంది.
మై ప్లేట్ ఫర్ ద డే జాబితా ప్రకారం ధాన్యాలు 240 గ్రాములు, కొవ్వులు 27గ్రాములు, గింజలు 30 గ్రాములు, పప్పులు, మాంసం 90 గ్రాములు, కూరగాయలు, ఆకుకూరలు 350 గ్రాములు, పండ్లు 150 గ్రాముల చొప్పున తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన 2వేల కేలరీలతోపాటు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లతోపాటు, సూక్ష్మపోషకాలు, విటమిన్లు సమృద్ధిగా సరిపోతాయని, మాంసం తినని వారు ఎక్కువగా పప్పులను తీసుకోవడం వల్ల కండరాల వృద్ధికి అవసరమైన మాంసకృత్తులు అందుతాయని వివరించారు. వీటిని క్రమంగా తీసుకోవడం వల్ల మైక్రో న్యూట్రియంట్ల కొరత కూడా తీరుతుందన్నారు.
విస్తృతంగా అందుబాటులో ఉన్న టెక్నాలజీ వల్ల పోషకాహారాన్ని ఎంపిక చేసుకోవడం క్లిష్టంగా మారింది. అయితే సరైన ఆహారానికి నిర్దిష్టమైన ప్రమాణాలు లేకపోవడంతో అవసరానికి మించిన కేలరీలు శరీరంలోకి చేరుతున్నాయి. లేదంటే అసలు పోషకాహారాన్ని నిర్లక్ష్యం చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి వాటిని నియంత్రించి మెరుగైన ఆరోగ్యాన్నిచ్చే మంచి పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా మై ప్లేట్ ఫర్ ద డే పేరిట జాబితా తయారు చేశారు. దీని ప్రకారం నిత్యం శరీరానికి అవసరమైన 2000 కేలరీలను ధాన్యాలు, పప్పులు, పాలు, ఆకుకూరలు, పండ్లు, గింజలతో కలిపి తీసుకుంటే సరిపోతుందని పేర్కొన్నారు. అదేవిధంగా పోషకాలను పొందేందుకు చాలా మంది సప్లిమెంట్స్ తీసుకుంటారని, దీని ద్వారా శరీరంలో మంచి బ్యాక్టీరియా వృద్ధి తగ్గిపోవడం, అజీర్తి, డయాబెటిస్ వంటి ఇతర రుగ్మతల బారిన పడుతున్నారని నిపుణులు తేల్చారు. అదేవిధంగా అమైనో ఆమ్లాలు, కొవ్వులు, ఖనిజాలు, ప్రోటీన్లు, విటమిన్లు, ఇతర బయోయాక్టివ్ పదార్ధాల అవసరాన్ని తీర్చేలా సరైన నిష్పత్తిలో ఆహార నమూనాలను సూచించారు. అయితే సమతుల్యమైన ఆహారంలోనే అన్ని పోషకాలు అందుతాయని, దీనికి ప్రత్యేకంగా ఎలాంటి మినరల్ సప్లిమెంట్లను తీసుకోవాల్సిన అవసరం ఉండదని నిపుణులు సూచిస్తున్నారు.
సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతోపాటు, జీర్ణకోశానికి అవసరమైన సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. దీంతో పోషకాల శోషణ మరింత వేగంగా జరుగుతుంది. మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు తగ్గుముఖం పడుతుంది. మెదడుకు మంచి పోషకాలు సరఫరా కావడం వల్ల ఏకాగ్రత, మానసిక ఎదుగుదలతోపాటు, శరీరంలో ఇన్సులిన్ అదుపులో ఉంటుంది.