సిటీబ్యూరో, జనవరి 8 (నమస్తే తెలంగాణ ) : కుక్కకాటుతో ఇటీవల బాలుడు మృతి చెందారని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ స్నేహ శబరీష్, వెటర్నరీ అధికారులు, వీధి కుక్కల బెడద కుక్కకాటు నివారణకు ఏర్పాటైన హైలెవల్ కమిటీ సభ్యులైన కార్పొరేటర్లతో మేయర్ సమావేశం నిర్వహించారు. వీధి కుక్కలకు రెగ్యులర్గా రేబిస్ వ్యాక్సిన్ అందించేందుకు వెటర్నరీ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జీహెచ్ఎంసీకి చుట్టుపక్కల ఉన్న 16 మున్పిపాలిటీలలో యాంటీ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్కు చర్యలు తీసుకోవాలన్నారు. స్టెరిలైజేషన్ ఆనంతరం నాలుగు రోజుల పాటు వాటిని కేంద్రాల్లోనే ఉంచిన తర్వాత విడుద చేయాలన్నారు. ఈ సమావేశంలో వెటర్నరీ అధికారి అబ్దుల్ వకీల్, కార్పొరేటర్లు సీవీ రెడ్డి, శ్రవణ్, రాజశేఖర్ రెడ్డి, బన్నాల గీత ప్రవీణ్, పద్మ వెంకట్రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్లు, వెటర్నరీ డాక్టర్లు పాల్గొన్నారు.