మియాపూర్,మే 4 : అకాల వర్షాలతో పాటు వర్షాకాలం నేపథ్యంలో భవన నిర్మాణాల పరంగా ప్రమాదాల నివారణకు వెస్ట్జోన్ అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల సందర్భంగా చోటు చేసుకున్న ప్రమాదాల నేపథ్యంలో.. పునరావృతం కాకుండా చూడాలని నడుం బిగించారు. ప్రధానంగా భవన నిర్మాణాలలో సెల్లార్ల తవ్వకాల పరంగా కొంతకాలం నిషేధం విధించారు. ఈ మేరకు బల్దియా ఉన్నతాధికారులు సైతం క్షేత్రస్థాయిలో తగు తనిఖీలు నిర్వహించి సెల్లార్ల నిర్మాణాలను నిలిపేయాలని ఆదేశించారు. దీంతో శేరిలింగంపల్లి జోన్లో జడ్సీ నేతృత్వంలో పట్టణ ప్రణాళికా విభాగం సీపీ, ఏసీపీలు, టీపీవోలు తమ తమ సర్కిళ్ల పరిధిలో పర్యటిస్తూ నిర్మాణంలో ఉన్న సెల్లార్లకు నోటీసులను అందిస్తున్నారు. నిబంధలకు విరుద్ధంగా వ్యవహరించే యజమానులపై కేసులు నమోదు చేస్తామని నోటీసులలో హెచ్చరిస్తున్నారు.
శేరిలింగంపల్లి జోన్ వ్యాప్తంగా సెల్లార్ల నిర్మాణాలపై అధికారులు దృష్టి సారించారు. ప్రధానంగా క్షేత్రస్థాయిలో పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు, సిబ్బంది పర్యటిస్తూ భవన నిర్మాణాలను, సెల్లార్లను గుర్తిస్తున్నారు. ఇప్పటికే జోన్ వ్యాప్తంగా 25 సెల్లార్లు నిర్మాణంలో ఉన్నట్లు గుర్తించి, యజమానులకు నోటీసులకు జారీ చేస్తున్నారు. సర్కిల్ 19 ఆర్సీపూర్లో 2, సర్కిల్ 20 శేరిలింగంపల్లి పరిధిలో 15, సర్కిల్ 21 చందానగర్లో 4, యూసుఫ్గూడ సర్కిల్ పరిధిలో 4 సెల్లార్లు నిర్మాణంలో వివిధ దశలలో ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. వర్షాకాలంలో ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా సెల్లార్ల నిర్మాణాలను నిశేధించారు. తదుపరి ఆదేశాల వరకు సెల్లార్లను చేపట్టవద్దని, విరుద్ధంగా నిర్మాణం కొనసాగిస్తే భవనాలను సీజ్ చేస్తామని నోటీసులో స్పష్టం చేస్తున్నారు.
వర్షాలు ముగిసే వరకు సెల్లార్ల వద్ద రక్షణ చర్యలను చేపట్టాలని యజమానులకు స్పష్టం చేస్తున్నారు. అయితే జోన్ పరిధిలోని శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్లలో బడా నిర్మాణ సంస్థలు తమ భారీ నిర్మాణాలలో సెల్లార్లను సైతం చేపడుతున్నారు. ఇటీవలే పలు సెల్లార్లను పరిశీలించిన జడ్సీ, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు వాటిని నిలిపేయాలని స్పష్టం చేశారు. అయితే ఓ వైపు అధికారులు సెల్లార్ నిర్మాణాల పరంగా సీరియస్గా హెచ్చరిస్తున్నా..కొందరు మాత్రం వాటిని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రమాదాలకు ఆస్కారం లేకుండా సెల్లార్ల నిర్మాణాలను నిలిపేయాలని యజమానులకు స్పష్టం చేశాం. నోటీసులను జారీ చేస్తున్నాం. నిబంధనలను పాటించని యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శంకరయ్య తెలిపారు.