సికింద్రాబాద్ : రాష్ట్ర ప్రజల సంక్షేమమే తెలంగాణ సర్కారు ధ్యేయమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. బోర్డు పరిధిలోని మూడో వార్డు మడ్ఫోర్ట్ గాంధీనగర్, శ్రీరాంనగర్లోని డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయం వద్ద సోమవారం సుమారు రూ.23.50 లక్షల వ్యయంతో చేపట్టనున్నమంచినీటి పైపులైన్ నిర్మాణ పనులకు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సాయన్న శంకుస్థాపన చేసి అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ రాష్ట్రంలోని వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళల సంక్షేమం కోసం ఆసరా పింఛన్లు అందిస్తున్నారని తెలిపారు. బీజేపీ నాయకులు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
రానున్న రోజుల్లో ప్రజలే బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రూపాయి ఖర్చు లేకుండా నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. ఇండ్లతో పాటు మౌళిక వసతుల కల్పనతో భాగంగా మంచినీటి పైపులైన్ పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.
కంటోన్మెంట్ అభివృద్ధిలో పాలుపంచుకోవాలనే ఉద్దేశ్యం లేకనే బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. బోర్డుకు రావాల్సిన నిధులను రప్పించే దమ్ములేని నేతలు కూడా నోరేసుకుని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే సర్వీస్ చార్జీలను రప్పించి కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధికి సహకరించాలని హితవు పలికారు.
ప్రజా సంక్షేమానికి అహర్నిశలు పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు కంటోన్మెంట్ వాసులు అండగా నిలువాలని కోరారు. కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు ప్రభాకర్, పాండుయాదవ్, శ్యామ్కుమార్, నళినికిరణ్, నేతలు నివేదితా, టీఎన్ శ్రీనివాస్, మహంకాళి శర్విన్, అంజనేయులు, ముప్పిడి మధుకర్, సదానంద్గౌడ్, శ్రీకాంత్, శ్రీను, సురేశ్, రమేశ్తో పాటు స్థానిక బస్తీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.