సిటీబ్యూరో, జూలై 20 (నమస్తే తెలంగాణ): వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం, దానికి అనుబంధంగా ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గత నాలుగు రోజులుగా గ్రేటర్ వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వానలు కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో రాగల మరో మూడు రోజులు గ్రేటర్లోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలను దృష్టిలో పెట్టుకుని వాతావరణ శాఖ గ్రేటర్కు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో గురువారం ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు అత్యధికంగా మల్కాజిగిరిలోని ఈస్ట్ ఆనంద్బాగ్లో 11.2 సెం.మీల వర్షపాతం నమోదైంది. ఈ వర్షాకాలంలో ఇదే రికార్డు స్థాయి వర్షపాతంగా అధికారులు తెలిపారు.
అయితే వర్షం కురుస్తున్న నేపథ్యంలో వర్షపాతం ప్రతి గంటకు పెరుగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా గ్రేటర్లోని లోతట్టు ప్రాంతాలు, కాలనీలు, అపార్ట్మెంట్లోని సెల్లార్లలోకి వరద నీరు చేరింది. కొన్ని చోట్ల రోడ్లపై వర్షం నీరు నిండి చెరువులను తలపిస్తోంది. ట్రాఫిక్ పోలీసులు, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దికి వరదనీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకుంటున్నారు. మల్కాజిగిరిలోని ఈస్ట్ ఆనంద్బాగ్లో 11.2 సెం.మీ, మియాపూర్ 10.7, నాచారం 10.4, హైదర్నగర్ 9.4, లాలాపేట 9.1, హబ్సిగూడ 9.0, మాదాపూర్ 8.8, చర్లపల్లి 8.7, ఎల్బీనగర్ 8.6, మూసాపేట 8.4, గచ్చిబౌలి 8.4, నాగోల్ 8.3, బంజారాహిల్స్ 8.3, హయత్నగర్ 8.2, మోండామార్కెట్ 8.1, మలక్పేట 8.0, లంగర్హౌస్ 7.9, నాంపల్లి 7.8, జూబ్లీహిల్స్లో 7.8 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్డీపీఎస్ అధికారులు వెల్లడించారు.