శేరిలింగంపల్లి, అక్టోబర్ 26 : రాబోయే ఎన్నికల్లో అభివృద్ధికి ఓటేద్దాం.. ఎమ్మెల్యేగా అరెకపూడి గాంధీని గెలిపించుకుందామని గచ్చిబౌలి టెలికాంనగర్ వాసులు తమ పూర్తి మద్దతు తెలియజేశారు. గురువారం గచ్చిబౌలి డివిజన్లోని టెలికాంనగర్ కాలనీలో మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాతో కలిసి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కాలనీవాసులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఆయనకు తమ పూర్తి మద్దతు తెలిపారు.
మూడోసారి గాంధీని గెలిపించుకొని అభివృద్ధికి మరింత బాటలు వేసుకుందామని తీర్మానించారు. కాలనీలో అందరూ ఐక్యమత్యంగా గాంధీ గెలుపుకోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని, ఎల్లవేళలా అందుబాటులో ఉండే ఆయనను మూడోసారి అధిక మెజార్టీతో గెలుపొందేలా మద్దతు కూడగట్టాలన్నారు. సీఎం కేసీఆర్, మంతి కేటీఆర్ల సహకారంతో శేరిలింగంపల్లి అభివృద్ధికి బాటలు వేయడం జరుగుతుందన్నారు. తన వెన్నంటే నిలుస్తున్న డివిజన్ బీఆర్ఎస్ నాయకులు, అధ్యక్షులు, మహిళా నాయకురాళ్లు, కాలనీల సంక్షేమ సంఘం ప్రతినిధులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు శ్రీనుపటేల్, మూల వెంకటేశ్ గౌడ్లతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.