మేడ్చల్, జూలై 28(నమస్తే తెలంగాణ): హరితహారం లక్ష్యాన్ని నేరేవేర్చేలా అధికారులు సన్నద్ధం అయ్యారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా హరితహారం కార్యక్రమంలో 63 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం, కాగా, ఇప్పటి వరకు 5 లక్షల మొక్కలు నాటారు. త్వరలోనే లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో 17 అర్బన్ పార్క్లలో లక్ష్యాన్ని పూర్తి చేశారు. త్వరలోనే జిల్లాలోని 13 మున్సిపాలిటీల పరిధిలో 61 గ్రామాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.
హరితహారం కార్యక్రమంలో నాటే మొక్కలను ఇప్పటికే సిద్ధం చేశారు. జిల్లాలోని 60 నర్సరీలలో 20 లక్షల మొక్కలు సిద్ధం కాగా, జీహెచ్ఎంసీ మిగతా మొక్కలను పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే హరితహారం కార్యక్రమాన్ని వేగవంతం చేయనున్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పార్క్లు, రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటనున్నారు.