చర్లపల్లి, జనవరి 9 : ఉప్పల్(Uppal) నియోజకవర్గ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయనున్నట్లు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Laxma reddy) పేర్కొన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్ పరిధిలోని జైజవాన్ కాలనీలో కాలనీ అధ్యక్షుడు తిరుమల్లయ్య ఆధ్వర్యంలో మంగళవారం ఎమ్మెల్యేను కాలనీవాసులు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని కాలనీల సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
జైజవాన్ కాలనీలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గత ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు నిధులు కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, పజ్జూరి పావణి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు కాసం మహిపాల్రెడ్డి, కుమారస్వామి, నాయకులు శేర్ మణెమ్మ, మహిళా అధ్యక్షురాలు శిరీషారెడ్డి, యూత్ అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, తదితరులు పాల్గొన్నారు.