మల్కాజిగిరి : ప్రభుత్వ దవాఖానలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి (Marri Rajashekar Reddy) అన్నారు. శనివారం మల్కాజిగిరిలోని ప్రభుత్వ దవాఖాన అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాలుగా ఆసుపత్రిలో లిఫ్ట్ (Hospital Lift) పనిచేయక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆపరేషన్ వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు(Cancer patients) మూడంతస్తులు ఎక్కలేక పోతున్నారని అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా కమిషనర్కు ఫిర్యాదుచేసి లిఫ్ట్ మెయింటనెన్స్ కాంట్రాక్ట్ను రద్దుచేసి కొత్తవారిని నియమిస్తామని అన్నారు. రెఫరల్ దవాఖానగా వస్తున్న రోగులకు మెరుగైన చికిత్స అందజేస్తామని అన్నారు. దివ్యాంగులు సదరం సర్టిఫికేట్ (Sadaram Certificate) తో వచ్చిన వారికి రైల్వే రిజర్వేషన్ దరఖాస్తులపై డాక్టర్లు సంతకం చేస్తారని అన్నారు.
రోగులు కూర్చోడానికి కుర్చీలు, దివ్యాంగులకు వీల్ చైర్ ఉన్నాయని, అవసరమైన వాటికి మరమ్మతులు చేస్తామని అన్నారు. ఔట్ పెషంట్లకు మరుగు దొడ్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి డక్టర్ రఘునాథ్ స్వామి, సూపరింటెండెంట్ డాక్టర్ సునీత, సర్కిల్ డీసీ రాజు తదితరులు పాల్గొన్నారు.