Ration Cards | హిమాయత్ నగర్, మే3: రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శనివారం హిమాయత్ నగర్లోని ఆదర్శబస్తీలో ఉన్న 602 రేషన్ దుకాణంలో లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే దానం నాగేందర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, కార్పొరేటర్ విజయారెడ్డి తో పాటు అధికారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీ కుటీర్ బస్తీలో లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడు..తూ కుటుంబ సభ్యులు పెరిగిన రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేస్తామని తెలిపారు. నగరంలో ఎన్నికల కోడ్ ఉండటం వల్ల గత నెల సన్న బియ్యం పంపిణీ చేయలేకపోయామని పేర్కొన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ సన్న బియ్యం అందజేస్తామని స్పష్టం చేశారు.
ప్రొటోకాల్ రగడ ..
హిమాయత్ డివిజన్లోని ఆదర్శ బస్తీలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం సంద ర్భంగా ప్రొటోకాల్ రగడ నెలకొంది. ఖైరతాబాద్ కార్పొరేటర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పి.విజయారెడ్డి ఫొటోను ప్లెక్సీపై పెట్టకపోవడంతో ఎమ్మెల్యే దానం నాగేందర్పై ఆమె అసహనం వ్యక్తం చేశారు. సన్న బియ్యం పంపిణీ చేస్తున్న క్రమంలో దానం పక్కన విజయారెడ్డి నిలబడి ఉండగా ఆమెను పక్కకు వెళ్లాలి అని దానం చెప్పారు. దీంతో నీ పని చూసుకో అంటూ విజయారెడ్డి ఘాటుగా సమాధానం ఇచ్చారు. అక్కడే ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ జోక్యం చేసుకుని విజయారెడ్డిని సముదాయించారు. కార్యక్రమం అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లుతున్న సమయంలో విజయారెడ్డి అనుచరులు, కాంగ్రెస్ మహిళా నేతలు పొన్నం ప్రభాకర్తో ఈ అంశంపై మాట్లాడగా తరువాత మాట్లాడుదామని చెప్పి వెళ్లిపోయారు. ఉద్దేశ్యపూర్వకంగానే విజయారెడ్డి ఫొటో పెట్టలేదని, పార్టీ కోసం పనిచేసే వారిని గుర్తించడం లేదని ఆమె అనుచరులు అసంతృప్తిని వ్యక్తం చేశారు.