సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణికి వచ్చే నెల 2వ తేదీ నుంచి శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జీహెచ్ఎంసీ పరిధిలోని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాలకు చెందిన కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి, హరీష్, అమయ్కుమార్, జీహెచ్ఎంసీ హౌజింగ్ ఓఎస్డీ సురేష్లతో కలిసి మంత్రి తలసాని సమావేశం నిర్వహించారు.
సెప్టెంబరు 2వ తేదీన జీహెచ్ఎంసీ పరిధిలోని 8 ప్రాంతాలలో అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీ చేయడం జరుగుతుందని, అందుకు అన్ని ఏర్పాట్లను చేయాలని మంత్రి కలెక్టర్లను ఆదేశించారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీలో పారదర్శకత ఉండేందుకుగాను ఈ నెల 24వ తేదీన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ర్యాండో మైజేషన్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి డ్రా పద్దతిలో అర్హులను ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పారు.
మొదటి విడతగా 12వేల మంది లబ్ధిదారులకు ఇండ్లను కేటాయించనున్నట్లు వివరించారు. సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేర్చి తన ఉదారత్వాన్ని చాటుకున్నారని మంత్రి తలసాని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రోడ్లు, డ్రైనేజీ, వాటర్, విద్యుత్ వంటి అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మించి పేదలకు ఉచితంగా అందజేస్తుందని చెప్పారు.