సిటీబ్యూరో, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా నిర్వహించాలని శానిటేషన్ సిబ్బందిని కమిషనర్ రొనాల్డ్ రాస్ ఆదేశించారు. మంగళవారం సౌత్జోన్ రాజేంద్రనగర్ అత్తాపూర్ డివిజన్లోని పెద్ద తాళ్లకుంట చెరువులు, శానిటేషన్ పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అధికారులు, నార్కోటిక్స్ ఇన్ డైరెక్ట్ టాక్స్ అధికారులు స్వచ్ఛ భారత్ కింద పెద్ద తాళ్లకుంటను దత్తత తీసుకుని చెరువు సుందరీకరణ పనులు చేపడతామని కమిషనర్ను కోరగా జీహెచ్ఎంసీకి లేఖ ఇవ్వాలని చెప్పారు. ఈ సందర్భంగా కమిషనర్ జీహెచ్ఎంసీ అధికారులకు చెరువు వద్ద లైటింగ్, ఫెన్సింగ్, సీసీ కెమెరాలు, ఓపెన్ జిమ్ మెటీరియల్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అనంతరం వల్నరబుల్ పాయింట్లను పరిశీలించి, ఇంటింటి నుంచి చెత్త సేకరణపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పక్కనే ఉన్న అంతరించిపోతున్న జాతుల పరిరక్షణకు నెలకొల్పిన ప్రయోగశాలను కమిషనర్ సందర్శించారు. తరువాత చింతలకుంట పార్కును పరిశీలించి వాకర్స్తో మాట్లాడగా, పార్కులో సీవరేజ్ వాటర్ ప్రవహించడం వల్ల దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. కమిషనర్ సంబంధిత ఈఈకి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైదర్గూడ జనప్రియ అపార్ట్మెంట్ వద్ద ఫుట్పాత్లు అక్రమణలకు గురి కాకుండా నిర్మాణం చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈవిడీఎం డైరెక్టర్ ప్రకాశ్రెడ్డి, చార్మినార్ జోనల్ కమిషనర్ వెంకన్న, డిప్యూటీ కమిషనర్ రవికుమార్, ఈఈ నరేందర్ గౌడ్, ఇంజినీరింగ్, శానిటేషన్ అధికారులు పాల్గొన్నారు.