వనస్థలిపురం, డిసెంబర్ 10 : ఎల్బీనగర్ సంపూర్ణ అభివృద్ధికి రూ.2,500 కోట్లు తీసుకొస్తున్నామని, మరో 6నెలల్లో రూపురేఖలు మారుస్తామని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. హస్తినాపురం డివిజన్లో రూ.11.50 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశానికే ఆదర్శమైన అభివృద్ధిని ఎల్బీనగర్లో చేపట్టడం జరుగుతుందన్నారు. త్వరలోనే సిగ్నల్ లేని ట్రాఫిక్ వ్యవస్థను రూపొందిస్తామన్నారు.
ఫ్లై ఓవర్లు, స్కైవేలు, అండర్పాస్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. అన్ని కాలనీల్లో మౌలిక వసతులను కల్పిస్తున్నామన్నారు. పతుల్లాగూడలో నిర్మించిన సర్వమత శ్మశానవాటిక అద్భుతంగా నిలిచిందన్నారు.హరిణవనస్థలి వద్ద అత్యాధునిక బస్ టెర్మినల్ నిర్మిస్తామన్నారు. సంపూర్ణ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామని, సీఎం కేసీఆర్, పురపాలక మంత్రి కేటీఆర్ల సహకారంతో కోట్లాదిగా నిధులు తీసుకువస్తున్నామన్నారు. ప్రజలంతా అభివృద్ధిలో భాగస్వాములై, సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు అందోజు సత్యం చారి, సీనియర్ నాయకులు గజ్జల మధుసూదన్రెడ్డి, గోపిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, శ్రీనివాస్నాయక్, శ్రీకాంత్రెడ్డి, వెంకటేశ్వర కాలనీ అధ్యక్షులు కాయతి రవీందర్రెడ్డి, మల్లికార్జున నగర్ లక్ష్మీపతిగౌడ్, బాలాజీనగర్ అధ్యక్షుడు విఠల్రెడ్డి, సత్యదేవ్ కాలనీ రాజశేఖర్రెడ్డి, ఇంజినీర్స్ కాలనీ శేఖర్రెడ్డి, దేవకీ ఎన్క్లేవ్ సాయినాథ్, గోకుల్ ఎన్క్లేవ్ జగన్మోహన్రెడ్డి, అనుపమానగర్ వెంకట్రెడ్డి, అగ్రికల్చర్ కాలనీ మణిపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.