రంగారెడ్డి, ఆగస్టు 15(నమస్తే తెలంగాణ): దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరిస్తూ.. వారి ఆశయ సాధనకు తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా సంక్షేమం, అభివృద్ధి పథకాలను అమలు పరుస్తూ.. రంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందే దిశగా ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. రైతన్నలకు అన్నిరకాలుగా వెన్నుదన్నుగా ఉంటున్నట్లు తెలిపారు. 24 గంటల విద్యుత్తుతోపాటు రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలను ముందస్తుగా అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు.
అకాల వర్షాల వల్ల పంటలను నష్టపోయిన 619 మంది రైతులకు రూ.95లక్షల పంట నష్ట పరిహారం అందించామన్నారు. రైతుబంధు కింద 2023-24 వానకాలం సీజన్లో 3,01,484 మంది రైతులకు రూ.248 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. రైతుభీమా ద్వారా 2022-23లో 794 రైతు కుటుంబాలకు రూ.39.70 కోట్లు అందజేశామని తెలిపారు. ఇప్పటివరకు 9,579 మంది రైతులకు రూ.31.14 కోట్ల రుణాలను మాఫీ చేసినట్లు వివరించారు. 1,92,827 భూ సంబంధిత దరఖాస్తులు రాగా.. ధరణి ద్వారా 1,64,718 దరఖాస్తులను పరిష్కరించామని తెలిపారు. జీవో.58 కింద 19,661 దరఖాస్తులు రాగా 4,552 దరఖాస్తులను పరిశీలించి ఇప్పటివరకు 2,681 మంది లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశామని, జీవో 59 కింద 13,231 దరఖాస్తులు రాగా 3,871 దరఖాస్తులను పరిశీలించి ఇప్పటివరకు 3,751 మందికి పట్టాలు అందజేసినట్లు పేర్కొన్నారు. జీవో.118 ద్వారా 5,802 దరఖాస్తులు రాగా 4,959 దరఖాస్తులను ఆమోదించినట్లు చెప్పారు. కల్యాణ లక్ష్మి పథకం ద్వారా 2022-23 సంవత్సరంలో 9382 మందికి రూ.93.92 కోట్లు, షాదీ ముబారక్ ద్వారా 4961 మందికి రూ.49.64 కోట్లు అందజేశామని తెలిపారు.
డబుల్ బెడ్రూం పథకం కింద 6,645 ఇండ్లను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాలకు 2022-2023 సంవత్సరంలో 12,061 స్వయం సహాయక సంఘాలకు రూ.800.11 కోట్లు బ్యాంకు రుణాలను అందజేశామన్నారు. 2023-24 సంవత్సరంలో 12,989 సంఘాలకు రూ.710 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు రూ.2,609 సంఘాలకు రూ.202 కోట్లు అందజేసినట్లు తెలిపారు. స్త్రీ నిధి ద్వారా 2022-23లో రూ.73.48 కోట్లు, 2023-24లో రూ.8.73 కోట్లు ఇప్పటివరకు అందజేశామన్నారు. టీఎస్బీపాస్ ద్వారా 1,747 పరిశ్రమలకు రూ.78,798 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడితో అనుమతులు లభించగా 1,358 పరిశ్రమలు రూ.62,952 కోట్ల పెట్టుబడితో పరిశ్రమలను స్థాపించి 7.25లక్షల మందికి ఉపాధి కల్పించామన్నారు. జిల్లాలో 19,333 ఎకరాల్లో రూ.63 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఫార్మాసిటీతో లక్ష మందికి పైగా ఉపాధి లభిస్తుందన్నారు. ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్లు ప్రతిమా సింగ్, భూపాల్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ కదివరన్ ఫళని, మహేశ్వరం డీసీపీ శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, కలెక్టరేట్ ఏవో ప్రమీల రాణి, అధికారులు పాల్గొన్నారు.
రూ.279.76కోట్ల చెక్కులు పంపిణీ
3,690 స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇచ్చే రూ.273.60కోట్లు, మెప్మా ఆధ్వర్యంలో 20 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజి ద్వారా అందించే రూ.2కోట్ల చెక్కులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి అందజేశారు. మత్స్య శాఖ ఆధ్వర్యంలో మంజూరైన ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు సంబంధించిన ప్రొసీడింగ్స్ను 42 మంది లబ్ధిదారులకు అందజేశారు. టీ ప్రైడ్ పథకం కింద 68 మంది ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు రూ.1.98కోట్ల చెక్కులను పంపిణీ చేశారు. ఎకనామికల్ రీహాబిటేషన్ స్కీం కింద 37 మందికి రూ.18.50 లక్షల విలువ గల చెక్కులను అందజేశారు. కులాంతర వివాహం చేసుకున్న మూడు జంటలకు అవార్డు కింద రూ.7.50 లక్షల విలువ గల చెక్కులను అందజేశారు.